Tuesday, June 23, 2009

అక్కినేని చేతి వేళ్ళకి డూపు


ఈ ఫొటొ లో వున్నాయన - ప్రముఖ సంగీత దర్శకుడు యస్. రాజేశ్వర రావు గారి పెద్దబ్బాయి రామలింగేశ్వర రావు. అందరూ సాలూరి బాబు అని అంటారు. ఈయన చేతి వేళ్ళు , అక్కినేని నాగెశ్వర రావు గారి చేతి వేళ్ళు ఒకేలా వుంటాయి. అంచేత ' చదువుకున్న అమ్మాయిలు ' సినిమాలో ' ఆడవాళ్ళ కోపంలో అందమున్నది ' అనే పాటలో అక్కినేని పియానో వాయించే క్లోజ్ షాట్లకి ఈయన చేతి వేళ్ళు డూప్ గా వాడేరు. ఆంతే కాదు ఆ సినిమాలో అక్కినేని పెట్టుకునే నల్లటి బెల్ట్ రిస్ట్ వాచ్ ని ఈ రామలింగేశ్వర రావు గారి చేతికి పెట్టి మరీ షాట్ తీశారు. దిగువనున్న వీడియో ని క్లిక్ చేసి చూడండోసారి .

Sunday, June 21, 2009

ఎన్టీయార్ కు తమిళ ' మాయాబజార్ ' లో డబ్బింగ్ ...

విజయా వారి 'మాయాబజార్ ' ద్వారా ఎన్టీయార్ కి శ్రీకృష్ణుడి గా ఎటువంటి ఇమేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. ఆ చిత్రాన్ని విజయా వారు తెలుగు , తమిళ భాషలలో ఏక కాలంలో నిర్మించారు.ముఖ్య పాత్రలవరకు చూసుకుంటే - తమిళ వెర్షన్ లో ఏయన్నార్ పాత్రని జెమిని గణేషన్ , సియ్యస్సార్ పాత్రని నంబియార్ ధరించగా - యస్వీఆర్ పాత్రని యస్వీఆర్, ఎన్టీయార్ పాత్రని ఎన్టీయార్ , సావిత్రి పాత్రని సావిత్రి నటించారు. ఐతే యస్వీఆర్, సావిత్రి తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోగా , ఎన్టీయార్ పాత్రకు మాత్రం వేరే వారి చేత డబ్బింగ్ చెప్పించారు. మచ్చుకి ఓ రెండు సీన్లు చూడండి.

Tuesday, June 16, 2009

' వివాహ భోజనంబు ' ని తమిళంలో పాడితే గొంతు పచ్చి పుండు ...

విజయా వారి 'మాయాబజార్ ' లో 'వివాహ భోజనంబు ' పాటను తెలుగు వెర్షన్ లో మాధవపెద్ది సత్యం , తమిళ వెర్షన్ లో తిరుచ్చి లోకనాథన్ పాడేరు. ట్యూన్ రెండు భాషలలోనూ ఒకటే. సాహిత్యం కూడా అంత నోరు తిరగనంతదేం కాదు. ఐతే తమిళ గీతాన్ని పాడిన తిరుచ్చి లోకనాథన్ గారికి గొంతు పచ్చి పుండై రెండు మూడు రోజుల దాకా మాట్లాడలేని పరిస్థితి వచ్చిందట. మన మాధవపెద్ది సత్యం గారు మాత్రం ఆ తెలుగు వెర్షన్ పాటను తను చనిపోయే దాకా స్టేజ్ ప్రోగ్రాం లలో కూడా పాడుతూ వుండేవారు. రిఫరెన్స్ కోసం రెండు పాటలనీ చూడండి ఓసారి .

' ఈ వెన్నెలా ఈ పున్నమి వెన్నెలా ' పాట వెనుక స్ఫూర్తి ...

' శభాష్ సూరి ' సినిమాలోని ' ఈ వెన్నెలా ఈ పున్నమి వెన్నెలా ' పాట గుర్తుండే వుంటుంది. తమిళం లో అంతకు ముందు వచ్చిన ' పెరియ ఇడుత పెణ్ణ్ ' అనే చిత్రం ఆధారంగా ఈ శభాష్ సూరి చిత్రాన్ని తీశారు. ఈ తమిళ చిత్రం లోని ' అన్డ్రు వందదుం ఇదే నిలా ' పాట స్టయిల్ ని, నడక ని , డ్రెస్ కోడ్ ని తెలుగు పాట ' ఈ వెన్నెలా ' పాటకు తీసుకున్నారు. ఐతే ట్యూన్ ఓపెనింగ్ కి మాత్రం క్లిఫ్ రిచర్డ్ పాడిన ' ద యంగ్ వన్స్ ' అనే పాట ట్యూన్ ని కొద్దిగా అనుకరించి , తమిళ పాట నడకతో జత కలుపుతూ తన దైన సృజనాత్మకతను జోడిస్తూ ' ఈ వెన్నెలా ' పాట ని ఆకర్షణీయం గా తయారు చేశారు సంగీత దర్శకుడు పెండ్యాల. మూడు పాటల వీడియో లను కొద్దిగా చూసి , వాటితో పాటు ' ఈ వెన్నెలా ' పాట క్లిప్పింగ్ ని కూడా మరోసారి చూసి కంపేర్ చేసుకోండి.

Monday, June 15, 2009

' మనసున మనసై ' పాటకు మూలం బెంగాలీ లో ...

గతం లో తెలుగు సినిమాలు బెంగాలీ సినీ పరిశ్రమ నుండి కథల్నీ, సంగీతాన్నీ తీసుకున్నాయని ఉదాహరణలతో సహా చెప్పుకున్నాం (ఓల్డర్ పోస్ట్ లు చూడండి). ఐతే అందుకు ఉదాహరణలు గా పేర్కొన్న ఆరాధన , మాంగల్యబలం సినిమాలలోని పాటలను చూపించినా - వాటి ఒరిజినల్స్ ఐన సాగరిక, అగ్నిపరీక్ష లను కథలతో సహా తీసుకున్నారు కాబట్టి - అని అనుకున్నా తప్పులేదు . కానీ మనందరికీ ఇష్టమైన ' మనసున మనసై ' పాటకు మూలం బెంగాలీలో వుందంటే కొంత ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే 'డాక్టర్ చక్రవర్తి ' సినిమా కథ స్వచ్చ మైన తెలుగు కథ. కోడూరి (అరికెపూడి) కౌసల్యా దేవి రాసిన 'చక్రభ్రమణం' నవల ఆధారంగా ఆ చిత్రాన్ని తీశారు. సో , అందులోని ఒక్క పాటకు కూడా బెంగాలీ సంగీతాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఐనా 'మనసున మనసై' పాటకు 'శాప్ మోచన్ ' అనే బెంగాలీ సినిమాలో హేమంత్ కుమార్ స్వరపరిచి పాడిన పాట ట్యూన్ ని తీసుకున్నారు. ఆ బెంగాలీ పాటకు నటించింది ఉత్తమ్ కుమార్. జతపరిచిన వీడియో ని చూడండి మీకే తెలుస్తుంది.

Thursday, June 11, 2009

' పెనుచీకటాయే లోకం ' పాటకు మూలం బెంగాలీ లో ...


ఇదివరకటి రోజుల్లో తెలుగు సినిమాల మీద బెంగాలీ నవలల ప్రభావం , బెంగాలీ సినిమాల ప్రభావం వుండేది. ఏయన్నార్ ఆరాధన సినిమాని బెంగాలీ సినిమా ' సాగరిక ' ఆధారం గా తీశారని , అందులో ' నా హృదయం లో నిదిరించే చెలీ ' పాటకు మూలం ఆ సాగరిక సినిమాలో వుందని చెప్పుకున్నాం (సవివరం గా కావాలంటే ఓల్డర్ పోస్ట్స్ చూడండి). అలాగే అన్నపూర్ణా వారు ' మాంగల్యబలం ' సినిమాని ' అగ్ని పరీక్ష ' అనే ఓ బెంగాలీ సినిమా ఆధారం గా తీశారు. ఆ సంగతి ఆ సినిమా టైటిల్స్ లోనే ఎక్నాలెద్జ్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మంగల్యబలం లోని ' పెను చీకటాయే లోకం ' పాట ట్యూన్ కూడా ఆ బెంగాలీ చిత్రం ' అగ్ని పరీక్ష ' నుంచి తీసుకున్నారన్నది కొందరికి మాత్రమే తెలిసిన విషయం . జతపరిచిన వీడియో ని చూసి కన్ఫర్మ్ చేసుకోండి .

' మల్లన్న ' లోని ఈ పాటని ట్రై చేసి చూడండోసారి

' మల్లన్న ' లో హీరో విక్రమ్ , దేవిశ్రీ ప్రసాద్ కలిసి పాడిన పాటలో 'ఇవన్నీ డూప్ ' అనే హుక్ లైన్ ని యూత్ తెగ పాడుకుంటున్నారు.ఈపాటలో మొదటి చరణం విక్రమ్ పాడేడు. మిగతా చరణాలు దేవిశ్రీ పాడేడు. సాహిత్యం ఎదురుగా వుంటేనే ఈ పాటను ఎవరైనా పాడగలరు. లేకపోతే ఎవ్వరూ పాడలేరు. ఎందుకంటే మొదటి చరణం లో రకరకాల చిరు తిళ్ళను పేర్కొంటూ ఇవన్నీ డూప్ - పిజ్జాయే టాప్పు అని అంటాడు విక్రమ్ . అలాగే రెండో చరణం లో రకరకాల బంధుత్వాలను పేర్కొని ఇవన్నీ డూప్ - స్నేహితుడే టాప్పు అని అంటాడు దేవిశ్రీ. ఇక మూడో చరణం లో రకరకాల ఫీలింగ్స్ గురించి చెప్తూ ఇవన్నీ డూప్ - జాలీయే టాప్పు అంటాడు. నాలుగో చరణం లో రకరకాల వ్యక్తులను సంభోధిస్తూ ఇవన్నీ డూప్ (వీళ్ళంతా డూప్ అని వుండాల్సింది) మల్లన్నే టాప్ అని ముగిస్తాడు. ఈ ' రకరకాలను ' ఏరి ఒక చోట కూర్చడం ఎంత కష్టమో ,వాటన్నిటినీ మర్చిపోకుండా గుక్క తిప్పుకోకుండా పాడడం అంతే కష్టం. అంచేతే 'ఇవన్నీ డూప్ ' అనే హుక్ లైన్ వుందనిపిస్తుంది. జత పరిచిన వీడియో ని చూడండోసారి .

Wednesday, June 10, 2009

పి.బి.శ్రీనివాస్ మొదట పాడింది ఏ భాష లోనో తెలుసా ?


ప్రముఖ గాయకుడు పి.బి.శ్రీనివాస్ గారిని కర్ణాటక ప్రభుత్వం రెండు వేల ఐదు వందల చదరపు అడుగుల స్థలాన్ని ఇచ్చి సత్కరించింది. మన గాయనీ గాయకులు మొదట మన ప్రభుత్వం నుండి కాక తమిళ , కర్ణాటక ప్రభుత్వాల నుండి గౌరవాలను పొందడం మామూలే . అవన్నీ పక్కన పెట్టి పి.బి.శ్రీనివాస్ గారి గురించి చెప్పుకోవాలంటే అంతటి సంస్కారి, మేధావి మరొకరు కనిపించరు మనకి. శాస్త్రీయ సంగీతం నేర్చుకునే వారికోసం ' డైమండ్ కీ ' కనిపెట్టాడాయన. ఎనిమిది భాషలలో కవిత్వం చెప్పగలడు , రాయగలడు కూదా . నవనీత సుమసుధ అనే రాగాన్ని కూడా కనిపెట్టాడాయన. ఇవి ఆయనెంతటి మేధావో చెప్పేవి. ఇక సంస్కారం గురించి ... బాలూ వచ్చిన కొత్తలో ఈయనకి పాటలు తగ్గితే కొంతమంది వచ్చి నెగెటివ్ గా మాట్లాదాలని ప్రయత్నిస్తే - ' మంచి పాటకి పి.బి.యస్. ఐతేనేంటి యస్.పి.బి. ఐతేనేంటి ?' అంటూ నవ్వేశాడాయన. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పి.బి.శ్రీనివాస్ తొలుత సినీరంగ ప్రవేశం చేసింది హిందీ పాటతో. మిస్టర్ సంపత్ అనే హిందీ సినిమాలో ఆయన పాడిన తొలి గీతాన్ని కొద్దిగా వీడియో రూపంలో జతపరుస్తున్నాం. చూచి ఆనందించండి.

Monday, June 8, 2009

నా హృదయం లో నిదిరించే చెలీ పాటకి మూలం బెంగాలీ లో ...


' ఆరాధన ' పేరు తో తెలుగులో ముగ్గురు పాప్యులర్ హేరోలైన ఏయన్నార్,ఎన్టీయార్, చిరంజీవి తో మూడు హిట్ సినిమాలు వచ్చాయి. ఇందులో ఏయన్నార్ నటించిన 'ఆరాధన ' లో ' నా హృదయం లో నిదురించే చెలీ ' పాట ను ఎవ్వరూ మరిచిపోలేరు. కాకపోతే చాలా మందికి తెలియని విషయాలు ఈ సినిమా గురించి వున్నాయి. కాలక్రమేణా కొంతమదికి ఇప్పుదు తెలియొచ్చు గానీ అప్పట్లో ఇవి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఏయన్నార్ ఆరాధన కి బెంగాలీ సినిమా ' సాగరిక ' మూలం . ఉత్తమ్ కుమార్ , సుచిత్రా సేన్ హీరో హీరోయిన్లు. అంతే కాదు మనం ఇవాళ్టికీ మర్చిపోలెకపోతున్న ' నా హృదయం లో నిదురించే చెలీ ' పాటను కూద ఆ బెంగాలీ సినిమా నుంచే తీసుకున్నారు. ఈ బెంగాలీ పాటకి సంగీతం రాబిన్ బెనర్జీ. జత పరిచిన వీడియో క్లిప్పింగ్స్ ని సరదాగా చూడండోసారి.

Sunday, June 7, 2009

' మల్లన్న ' లో ' అలేగ్రా ' పాట గురించి ...

ఈ పాటని రీటా పాడింది. ఈ అమ్మాయి కి తమిళ నాట సింగర్ గా మంచి పేరుంది. ఈ పాటకి రచన సాహితి. నటించింది గ్రూప్ డాన్సర్స్ తో శ్రియ . అలేగ్రా అంటే అదో ఇటాలియన్ పదం అనీ , ఈ పాట హిరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ గా వస్తుందనీ ఓ అనధికార సమాచారం . ఇక పాటని ఎంత రిచ్ గా తీశారో జత పరిచిన వీడియో క్లిప్ ని చూస్తేనే తెలిసిపోతుంది . సీ అండ్ ఎంజాయ్

' మల్లన్న ' లో ' ఎక్స్ క్యూజ్ మీ ' పాట గురించి ...

'ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ మల్లన్నా' పాట ప్రస్తుతం క్రేజీ సాంగ్ ఆఫ్ ది యూత్ గా చెలామణీ అవుతోంది. దీని తమిళ వెర్షన్ ' ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ కందస్వామీ' పాటకు కూడా తమిళ నాట అంతే ఆదరణ లభిస్తోంది. మన దేవిశ్రే కి ఈ డ్యూయెల్ వెర్షన్ హిట్స్ కొత్త కాదు. లోగడ వర్షం (తెలుగు), మలై (తమిళం) కి కూడ ఇలాగే సమాన గౌరవాన్ని అందుకున్నాడాయన. ఈ పాటని హీరో విక్రమ్ , సుచిత్రా కార్తిక్ కుమార్ పాడారు. ఈ పాటలో కూదా విక్రమ్ గాయకుడి గా తన ప్రతిభను ఎలా ప్రదర్శించాడో గమనించవచ్చు. ఇక్కడ మరో మాట చెప్పుకో వలసింది రచయిత సాహితి గురించి. 'ఒట్టి సిమ్ కార్దు - ఎమ్టి ఐ పాడ్ - నిన్ను స్విచ్చాను చెయ్యడమే వేస్టూ ' లాంటి లేటెస్ట్ టెక్నాలజీ పదాలతో పాటు ' ఎల్ బోర్డూ ... రేయ్ ఎల్ బోర్డూ - ఎప్పుడెక్కుతావ్ మెయిన్ రోడ్డూ ' లాంటి చిలిపి చమత్కారాలు కూడా చేసి పాట ను జనం నోటికి పట్టుకునేలా చెయ్య గలిగాడు. జత పరిచిన వీడియోని చూడండి మీకు తెలియకుండా మీరే పాడుకుంటూ వుంటారు కాస్సేపటికి.

' మల్లన్న ' లో ' మాంబో మానియా ' పాట గురించి ...

ఈ పాట ని విక్రమ్ , రీటా పాడగా మధ్య మధ్య దేవిశ్రీ ప్రసాద్ గొంతు కూడా వినిపిస్తూ వుంటుంది. విక్రమ్ లోని గాయకుడు ఎన్ని పోకడలు పోయాడో చెప్పడానికి ఈ ఒక్క పాట సరిపోతుంది . చిత్రీకరణ కూడా బాగుంటుంది అని చెప్పడానికి ' ఫదేల్ ఫడేల్ ఫడేల్ ' దగ్గిర చూడండి. ఈ పాటకి మోహన రాగం ఆధారం . ఈ రాగం లో రెహమాన్ చేసిన 'మావేలే మావేలే ' (జంటిల్ మన్) , ఇళయరాజా చేసిన 'నిన్ను కోరీ వర్ణం (ఘర్షణ) పాటల్ని గుర్తుచేసుకుంటూ ఈ పాటని విని చూడండి . ఇళయరాజా , రెహమాన్ , దేవిశ్రీ ఈ ముగ్గురూ ఈ రాగాన్ని ఎంత బాగా ప్రయోగించారో తెలుస్తుంది .

Friday, June 5, 2009

పాటలు రాసే దాశరథి గారికి పాట ఎందుకు రాదు ?


ఆంధ్రప్రదేశ్ ఒకప్పటి ఆస్థాన కవి డాక్టర్ దాశరథి (అసలు పేరు దాశరథి కృష్ణమాచార్యులు ) సినీ గీత రచయిత కూడా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్నపూర్ణా వారి ' ఇద్దరు మిత్రులు ' చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసిన దాశరథి గారికి ఆ బ్యానర్ అంటే ప్రత్యేకమైన గౌరవం . అందుకే అన్నపూర్ణా వారు తీసిన 'చదువుకున్న అమ్మాయిలు ' సినిమాలో ఓ చిన్న వేషం కూడా వేశాడాయన . ఆ సినిమాలోని బ్రహ్మచారుల నిలయం సెట్ ల లో బాత్ రూం దగ్గర క్యూ కట్టి బ్రహ్మచారులు అవస్థ పడే సీన్ లో బాత్ రూం లోకెళ్ళి తలుపేసుకుంటూ ' అబ్బాయిలూ ... నాకు పాట రాదు. తలుపు తీయొద్దు. తీశారో మీఖర్మ ' అని చెప్పి తలుపేసుకునే వ్యక్తి దాశరథి గారే. జతపరిచిన వీడియోని క్లిక్ చేసి చూసి గుర్తుపట్టండోసారి.

మీరిది గమనించారా ? (రెండు)

పంథొమ్మిది వందల అరవై నాలుగులో 'దాగుడుమూతలు ' అనే సినిమా రిలీజైంది. ఆ సినిమాలో ఓ పాట - 'దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం '. అలాగే పంథొమ్మిది వందల అరవై ఐదులో ' వీరాభిమన్యు ' అనే సినిమా రిలీజైంది. ఇందులోని పాట - ' రంభా ఊర్వశి తలదన్నే ' . ఈ రెండు సినిమాలకీ కేవీ మహదేవనే సంగీత దర్శకుడు.ఈ రెండు పాటలూ హిట్టే. కానీ ఈ రెండు పాటల్లోనూ ఒక లైన్ దగ్గర ట్యూన్ కామన్ గా వుందని ఆ రోజుల్లో కొంతమంది మాత్రమే గ్రహించగలిగారు. కావాలంటే ' దేవుడనే వాడున్నాడా ' పాటలో 'తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ ' అనే లైన్ దగ్గిర ట్యూనూ , ' రంభా ఊర్వశి తలదన్నే ' పాటలో ' తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా ' , 'కలికి సరసనా పులకరించీ కరగిపోవని తనువేలా ' అనే లైన్ల దగ్గర ట్యూనూ ఒకేలా వుంటాయి వినడానికి. ఈ ఆర్టికిల్ తో పాటు జత పరిచిన వీడియోని ఓ సారి క్లిక్ చేసి చూడండి. .

Thursday, June 4, 2009

పుట్టినరోజు సందర్భం గా మీతో భాస్కరభట్ల ...

భాస్కరభట్ల రవికుమార్ ప్రస్తుతం మాంచి డిమాండ్ వున్న సినీ గీత రచయిత. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే (పోకిరి)లాంటి పాటలూ రాయగలడు. నీ కళ్ళ తోటి నా కళ్ళ లోకి (తులసి) లాంటి పాటలూ రాయగలడు. అందుకే 'బట్లేసుకున్న పాటలకైనా , బట్లేసుకోని పాటలకైనా భాస్కరబట్ల నేసుకుంటే రెండిటికీ సంపూర్ణ న్యాయం చేస్తాడూ అనే టాక్ ఇండస్ట్రీ లో వుంది. జూన్ ఐదు భాస్కరభట్ల బర్త్ డే. ఈ సందర్భం గా ఓ చిన్న వీడియో ఇంటర్ వ్యూ చేద్దామని అడగగానే ఒప్పుకున్నాడాయన. ఆయన మీతో చెప్పాలనుకున్న సంగతులు డైరెక్ట్ గా ఆయన మాటల్లోనే వీడియో రూపంలో చూడండి.


మీరిది గమనించారా ?

పంథొమ్మిది వందల అరవై ఒకటిలో రిలీజైన భక్త జయదేవ, భార్యాభర్తలు సినిమాలలోని పాటలు గుర్తుండే వుంటుంది. రెండిటికీ యస్.రాజేశ్వరరావే సంగీత దర్శకుదు.అభినయించిన నాయకుదు - అక్కినేని నాగేశ్వరరావు.ఇప్పుడు చెప్పదలచుకున్న విషయానికి సంబంధించిన ఆ పాటలు రెండూ - భక్త జయదేవ లో 'యారమితా వనమాలినా' ,భార్యాభర్తలు లో 'మధురం మధురం ఈ సమయం' . ఈ రెండు పాటలనీ వింటుంటే ట్యూన్ ఒక దగ్గిర కామన్ గా వున్నట్టు అనిపిస్తుంది. యారమితా వనమాలినా లో 'సకల భువన జన వర తరుణేనా' అనే లైన్ దగ్గర ట్యూనూ, మధురం మధురం ఈ సమయం లో 'పరిమళించె అనురాగపు విరులూ' అనే ట్యూనూ ఒకేలా వున్నాయనిపిస్తుంది. ఆ పాటల రెండో చరణాలలోని 'అమృత మధుర తర మృదు వచనేనా ' దగ్గిర,'పొంగిపొరలె మన కోర్కెల అలలూ ' దగ్గిర కూడా అలాగే ఫీలవుతాం .

Wednesday, June 3, 2009

ఏమని వర్ణించనూ ....


సమర్ధతకు సాకారం , ప్రతిభకు ప్రాకారం , సంస్కారానికి శ్రీకారం ... ఇవీ బాలూ గారి గురించి షార్ట్ కట్ లో చెప్పాలంటే దొరికే మాటలు.గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడి గా, ఇంకా ప్రేక్షకులకు తెలిసిన 'చాలా చాలా గా' వీటి గురించి కొత్త గా చెప్పాల్సిన పని లేదు. కానీ చాలా మందికి తెలియనిది ఆయన సంస్కారం గురించి . అది కేవలం రుచి చూసిన కొద్ది మందికే తెలుసు. ఒకసారి ఆ సంస్కారం కి అలవాటు పడ్డాక ప్రపంచం లోని కుళ్ళు తో ఎడ్జెస్ట్ అవడం కష్టం. అదో తీయటి ప్రమాదం ఉంది ఆయన స్నేహం తో. రోజుకున్న రెండు పూటలలో ఒక్క పూటైనా స్నేహితుడితో భోజనం చేయకపొతే ఆరోజు వేష్ట్ కింద లెక్కగా భావించే స్నేహశీలి ఆయన. స్నేహానికి ఆయన ఇచ్చే విలువల గురించి నా దగ్గరున్న అనుభవాలను పేర్కొనడం మొదలు పెడితే ఈజీ గా అదో గ్రంధమే అవుతుంది. వీలుని బట్టి అప్పుడప్పుడు ఇకనుంచి ఈ బ్లాగులో రాస్తూ వుంటాను. దానికి బాలూ గారు పర్మిషన్ ఇస్తారనే ఆశిస్తూ .... బాలూ గారికి జన్మ దిన శుభాకాంక్షలు.

అసెంబ్లీ లో అడుగు పెట్టడానికి ఓ రోజు ముందు ...









సికింద్రాబాద్ నియోజక వర్గం నుండి మ్మెల్యే గా ఎన్నికైన సహజ నటి జయసుధను ఆంధ్ర ప్రదెశ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సగౌరవం గా సత్కరించింది. సీనియర్, జూనియర్ పాత్రికేయులెందరో జయసుధ గారితో తమకున్న అనుబంధాన్ని,ఆమె వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ ప్రసంగించారు. తరువాత జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమం లో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు జయసుధ గారు ఇచ్చిన సమాధానాల సారాంశం ఇదీ : " క్రికెట్ మ్యాచ్ ని టీవీ లో చూస్తున్నపుడు తప్ప నేనెప్పుడూ ఉద్వేగానికి లోను గాను. కనుక గెలుపు, ఓటమి,అసెంబ్లీ లో తొలిసారి కాలు పెట్టడం ఇలాంటి వాటికి థ్రిల్ ఫీల్ కాను. ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ వుంటుందంటారు. నా విజయం వెనక దేవుడున్నాడు. ప్రజలు నన్ను సికింద్రాబద్ కే పరిమితం చేసుకోలేదు. ఎక్కదెక్కడి వాళ్ళో వచ్చి వారి సమస్యలు నాతో చెప్పుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం కాన్సర్ పేషెంట్ కి హాస్పిటల్ లో ఎడ్మిషన్ దొరకకపోతే తీసుకు వచ్చి మా ఇంటి ముందు పడేశారు. " ఇలా తన మనసులోని భావాలను పాత్రికేయులతొ పంచుకుంటూ వారికి అండగా తనెప్పుదూ ఉంటానన్నారు. విచ్చేసిన వారందరి ముఖాలలో సంతొషం తొణికిసలాదుతూ వుండగా సమావేశం ముగిసింది.

Monday, June 1, 2009

'కరెంట్' ఆడియో లోని 'అటు నువ్వే ఇటు నువ్వే ' పాట గురించి ...


ఈ పాటను నేహ భసిన్ పాడింది.ఈమెది ఓ టిపికల్ వాయిస్. పేరుకి శోక గీతమే ఐనా ఈమె వాయిస్ లో వున్న ఓ విచిత్రమైన హస్కీ నెస్ పాటకి స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్ లో కూడా ఏదో తెలియని డెప్త్ వుంది. ఈ ఆడియోలోని మిగిలిన నాలుగు పాటలతో కాకుండా ఈ ఒక్క పాటని విడిగా వింటే పాట ట్యూన్ లోనూ,సాహిత్యం లోనూ వున్న డెప్త్ ని ఫీల్ అవగలం. ఇక సాహిత్యం గురించి చెప్పాలంటే - రామ జోగయ్య శాస్త్రి గారి గురించి తెలియని వాళ్ళకి ఈ పాట సీతారామ శాస్త్రి రాశారనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ గురించి సీతారామ శాస్త్రి గారు ఇచ్చినన్ని ఎక్స్ ప్రెషన్లు ఇంకెవరూ ఇవ్వలేదు గనుక. ఈ పాటలొ 'నాకే తెలియకుండా నాలో నిన్ను ఒదిలావే - నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే - మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే'లాంటి వాక్యాలు రామజోగయ్య శాస్త్రి లోని సీతారామ శాస్త్రి గారిని ఆంజనేయుడి గుండెల్లో రాముడు కనిపించినట్టు అద్దం పట్టినట్టు చూపిస్తాయి.