Sunday, May 31, 2009

కరెంట్ టైటిల్ సాంగ్ గురించి ....


'అందాల చందమామ లాంటి అమ్మడూ' అనే పల్లవితో మొదలయ్యే ఈ 'కరెంట్' టైటిల్ సాంగ్ ని బెన్ని దయాళ్ పాడారు. మధ్య మధ్య దేవిశ్రీ వాయిస్ అవసరమైనప్పుడు కలుస్తూ వుంటుంది. కుర్రకారు దృష్టిలో మొదటి స్థానాన్ని, పెద్దకారు దృష్టిలో రెండవ స్థానాన్ని ఆక్రమించుకుంటుందీ పాట. అందుక్కారణం 'కే ఐ యెన్ జీ వస్తున్నాడూ కింగ్' ట్యూన్ ని గుర్తుకు తెచ్చేలా ఈ పాటలో 'సర్రు మంటూ ఒళ్ళంత పాకే ఫీలింగేరా కరంట్' అనే వాక్యాలు వుండడమే. ఇక మిగిలిన పాటంతా హుషారుగానే వుంటుంది. దానికి రచయిత రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. 'నీ హార్ట్ కొత్త బీటు కొట్టినప్పుడూ- రీచార్జ్ చేసినట్టు ఎనర్జి లెవెల్స్ ఎవరెస్టుకెక్కినప్పుడూ - నీ మాట ఈల పాట పాడినప్పుడూ - నీ మనసు తీన్ మార్ ఆడినప్పుడూ - నీ కంటి చూపు నీ మాట వినకుండ దిక్కులన్ని చూసినప్పుడూ- రంగుల్తో రామకోటి రాసినప్పుడూ-నీ పేరు నువ్వే మర్చిపోయినప్పుడూ - నువ్వంటే నీకె చాలా నచ్చినప్పుడూ - ఆనాటి రోమియో నీలాగ పుట్టినట్టు నువ్వే ఫీలైనప్పుడూ' లాంటి వాక్యాలు మచ్చుకి కొన్ని .

కరెంట్ సినిమాలోని 'రెక్కలు తొడిగిన పక్షల్లె ' పాట గురించి ....


ఈ పాటని దేవిశ్రీ తమ్ముదు సాగర్,రెనిన పాడారు. సంగీత పరం గా ఈ పాటకు మొదటి స్థానాన్ని ఇవ్వొచ్చు. ముఖ్యం గా చరణాల బిగినింగ్ లో ని ట్యూన్ గనక నోటికి పట్టుకుందంటే ఇక వదలదు. హాంట్ చేస్తూనే వుంటుంది.రచయిత భాస్కరభట్ల కూదా ఆ జీవ స్వరాలకు తగ్గట్టు గానే తన పదాలతో ప్రాణం పోశాడు. 'ప్రపంచమంత జయించినట్టు ఉప్పొంగి పోతోంది ప్రాణం - పెదాలలోన పదాలు అంది క్షణాలలో మాయం - క్షణాలనేమో యుగాలు చేసి తెగేడిపిస్తోంది కాలం - మనస్సుతోటి మనస్సులోకి రహస్య రాయభారం' లాంటి వాక్యాలతొ తన లోని ప్రతిభతొ మరొసారి శ్రోతలను ఆకట్టుకుంటాడు.విని చూడండి మీకే తెలుస్తుంది.

దేవిశ్రీ 'కరెంట్ ' రిలీజైంది



దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిచ్చిన 'కరెంట్' ఆడియో రిలీజైంది. అక్కినేని మనవడు , నాగార్జున మేనల్లుడు ఐన సుశాంత్ సినిమా లో హీరో. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియో లో ఐదు పాటలున్నాయి.(గోపి గోపిక గోదావరి ఆడియో నుంచి ఐదు పాటల ట్రెండ్ మొదలైనట్టుంది). కరెంట్ ఆడియో లోని ఐదు పాటలలో రెండిటిని భాస్కరభట్ల రాశారు. మిగిలిన మూడిటిని రామ జోగయ్య శాస్త్రి రాశారు. మొదటి పాట యూ వర్ మై లవ్ లోని ఇంగ్లీష్ లిరిక్స్ ని దేవిశ్రీ ప్రసాద్ రాశారు . డి యస్ పి అని వుంటుంది. మూడవ పాట అమ్మాయిలు అబ్బాయిలు పాట లోని ఇంగ్లీష్ లిరిక్స్ ని (అందరి వాడు పాట పాడిన) ఆండ్రియా రాశారు. నాల్గవ పాట కరెంట్ టైటిల్ సాంగ్ లోని ఇంగ్లీష్ లిరిక్స్ ని దివ్య ,రెనిన కలిసి రాశారు. దివ్య ఇదివరకు 'రెడీ' లో ఓం నమస్తే బోలో పాటని పాడింది. రెనిన ఆడియో లోనే 'రెక్కలు తొడిగిన పక్షల్లే ' పాటని పాడింది. ఇందులోని పాటల గురించి తర్వాత చర్చించుకుందాం .

Friday, May 29, 2009

'మల్లన్న ' లో విక్రమ్ విశ్వరూపం


తమిళం లో కందస్వామి గా తెలుగులో మల్లన్న గా విడుదలవుతున్న సినిమా లో విక్రమ్ ఆడవేషం లో కనిపించడం తో పాటు తన పాటల్ని తనే పాడుకున్నాడు. ఎంత బాగా పాడాడో ఆడియో విన్నవాళ్ళకి తేలుస్తుంది . విక్రమ్ లో నిజం గా ఓ మంచి గాయకుడు ఉన్నాడని ఎవరైనా సరే ఒప్పుకుని తీర్తారు . సంగీత పరం గా దేవిశ్రీ ప్రసాద్ కొత్త రకం ట్యూన్స్ నిచ్చాడు. పాటలన్నీ చాలా బావున్నాయి. రచయిత సాహితి ప్రతి పాటలోనూ ఒక్కో రకం ప్రయోగాన్ని చేశారు . వెంటనే మల్లన్న ఆడియో ని కొని , ప్రతి పాటని ఓ రెండు మూడు సార్లు విని చూడండి. మీరే ఒప్పుకుంటారు .

Monday, May 25, 2009

వొ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ ఆయే ...



అలనాటి ప్రముఖ నటి శ్రీమతి గీతాంజలి ఇటీవల ఫంక్షన్ లో కనిపించారు . " మధ్యనే గోపీ గోపిక గోదావరి సినిమాలో హీరో వేణు కి తల్లిగా మంచి వేషం వేశానండీ . ఎంతో ప్రాముఖ్యత వున్న క్యారెక్టర్. కచ్చితంగా నాకు మళ్ళీ మంచి పేరు తెచ్చి పెట్టే క్యారెక్టర్ అది. మీరు, మీ పాఠకులు చూసి ఎలా వుందో చెప్పాలి ." అని సహృదయం తో అన్నారావిడ. ఇక్కడ గీతాంజలి గారి గురించి చాలా మందికి తెలియని విషయం చెప్పాలనిపిస్తోంది . 'పారస్ మణి ' అనే హిందీ సినిమా లో ఆవిడ హీరోయిన్ గా నటించారు. సంగతి మనం గుర్తు పెట్టుకోక పోయినా ఉత్తరాది వాళ్లు మాత్రం మర్చిపోరు. సినిమా లో గీతాంజలి గారు నటించిన ' వొ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ ఆయే ' పాటను తలచుకుంటూనే ఉంటారు. మీకు ఇంకో విషయం తెలుసా ? 'పారస్ మణి ' చిత్రం యావద్భారత దేశాన్ని తమ సంగీతం తో ఉర్రూతలూపిన లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ జంటకి తొలి చిత్రం. అందుకే గీతాంజలి గారు నటించిన 'గోపి గోపిక గోదావరి ' చిత్రం లోని స్టిల్ ని , 'పారస్ మణి ' లోని పాటని (వీడియో రూపం లో) జత చేస్తున్నాం. చూసి ఆనందించండి .

ఈ పాటకు నటనలో ఏ బాధలు దాగెనో ...


'అమరశిల్పి జక్కన ' సినిమా లో పాప్యులర్ ఐన 'ఈ నల్లని రాలలొ ' పాట కు సంబందించి ఓ విశేషం ఉంది . ఆ చిత్ర నిర్మాత దర్శకుడు అయిన బి.యస్. రంగా ఓ విచిత్రమైన మనస్తత్వం గలవాడు. ఒక్కోసారి ఎంత ఖర్చు పెడతాడో , ఒక్కోసారి అస్సలు పైసా కూడా విదల్చడు. ' ఈ నల్లని రాలలో ' పాటకి ప్లేబ్యాక్ మెషీన్ లేకుండా అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసేశాడు. అక్కినేని మేకప్ చేసుకొని వచ్చేసరికి "మెషీన్ తేలేదు , డబ్బులు లేవు, ఎలాగోలాగ ఎడ్జెస్ట్ అయిపోండి" అన్నాడు . షూటింగ్ క్యాన్సిల్ చెయ్యండి అని అనడానికి మనసొప్పక , ఎలాగూ పాటంతా బై హార్ట్ చేసే అలవాటు, సంగీత జ్ఞానం వుండి కనుక తనకు తనే ప్లేబ్యాక్ పాడుకుంటూ , లిప్ మూమెంట్ ఇచ్చుకుంటూ మ్యానేజ్ చేశారు అక్కినేని. అదృష్టవశాత్తూ కరెక్ట్ గా సింక్ అయింది అదీ సంగతి.

Sunday, May 24, 2009

గొపి గోపిక గోదావరి లో మరికొన్ని చిన్ని చిన్ని పాటలు


వంశీ దర్శకుడి గా చక్రి సంగీత సారధ్యం లో వల్లూరిపల్లి రమేష్ నిర్మించిన ' గోపి గోపిక గోదావరి' సినిమా ఆడియో రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు జెమిని వారివి. ఆడియో హిట్ అయిన సందర్భం గా

చక్రి ని అభినందిద్దామని ఆయన స్టూడియో కి వెళ్తే అక్కడ వంశీ గారు రికార్డింగ్ థియేటర్లో కనిపించారు. అవును వాళిద్దరూ ఇష్ట పడ్డారు సినిమా లో లాగ చిన్న చిన్న పాటల లాంటివి రికార్డ్ చేస్తున్నామని చెప్పారు. అలా వచ్చె ఆ రెండేసి లైన్ల స్వరఖందికల్ని వంశీ గారు, చక్రి గారు రాసేసుకున్నారు. ఎలాగూ ఆడియో రిలీజ్ అయిపొయింది కాబట్టి మళ్ళీ మరో అకేషన్ చూసుకొని ఈ స్వరఖందికలతో మరో ఆడియో రిలీజ్ చేస్తే సంగీతాభామానులు సంతోషిస్తారు.

కమల్ హసన్ కోసం గొల్లపూడి స్క్రీన్ ప్లే


భారత దేశం గర్వించ దగ్గ నటుడు కమల్ హసన్ చెన్నై లో ఓ వర్క్ షాప్ ని నిర్వహించబోతున్నారు . ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ ప్రముఖులతో పాటు , కే . బాలచందర్ , గొల్లపూడి మారుతీ రావు వంటి లబ్ధ ప్రతిష్టులు కూడా పాల్గొనబోతున్నారు. జూన్ మూడు న జరగబోయే సెమినార్ లో స్క్రీన్ ప్లే మీద ఓ ప్రత్యేక వ్యాసాన్ని రాయవలసింది గా

గొల్లపూడి గారిని కమల్ హసన్ కోరారు . గొల్లపూడి గారు మన విశ్వనాథ్ గారు తీసిన 'ఓ సీత కథ ' స్క్రీన్ ప్లే గురించి రాయబోతున్నారు. కమల్ హసన్ కి, ఓ సీత కథ కి సంబంధం ఏమిటనుకుంటున్నారా ? ఓ సీత కథ తమిళ , మళయాళ వెర్షన్స్ లో నటించింది కమల్ హసనే కాబట్టి . గొల్లపూడి గారు రాయబోయే ఆ వ్యాసం కాపీ ని ఈ బ్లాగు పాఠకుల కోసం పంపిస్తానన్నారు. అతి త్వరలో ఆ వ్యాసాన్ని మనం చూడొచ్చు.

ఆ చెయ్యి ఎవరిదో తెలుసా ?

ఇప్పుడంటే గ్రాఫిక్ లు వచ్చి అంతా ఈజీ ఐపోయింది గానీ , పాత రోజుల్లో ట్రిక్ ఫోటోగ్రఫీ అంటే తీసే వాళ్ళకి ,
చేసే వాళ్ళకి యమ యాతన గా ఉండేది. అందులో ద్విపాత్రాభినయం ఐతే మరీనూ. అక్కినేని తొలి ద్విపాత్రాభినయ చిత్రం
'ఇద్దరు మిత్రులు' లో ఫోటోగ్రఫీ ప్రత్యేకించి ప్రశంసించ దగ్గది . క్లైమాక్స్ సీన్ లో ఇద్దరు నాగేశ్వరరావు లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం చూసి ప్రేక్షకులు మురిసిపోయారు. అక్కడ నటించిన అక్కినేని, చిత్రీకరించిన సెల్వరాజ్ ల ప్రతిభ తో పాటు మరొకరి హస్తం కూడా ఉంది . కళాతపస్వి , దర్శకుడు కే. విశ్వనాథ్ గారు ఆ రోజుల్లో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారికి అసిస్టెంట్ గా పని చేసే వారు. 'ఇద్దరు మిత్రులు ' క్లైమాక్స్ సీన్ లో కోటు వేసుకున్న నాగేశ్వర రావు గారి పక్క నుంచి నాగేశ్వరరావు గారి చెయ్యి లా భ్రమింప చేస్తూ వచ్చిన చెయ్యి శ్రీ కే. విశ్వనాథ్ గారిది. ఈ విషయాన్ని నాగేశ్వర రావు గారే స్వయం గా ఈ మధ్య నే చెప్పారు.

ఈమె ఎవరో తెలుసా ?


' భార్యాభర్తలు' సినిమాలో 'జోరుగా హుషారుగా ' పాటలో అక్కినేని లవర్స్ లో ఒకామె గా నటించి, తర్వాతి సీనులో
నటి జయంతి తో అక్కినేని కోసం కొట్లాడే గర్ల్ ఫ్రెండ్ గా కనిపించే ఈవిడెవరో తెలుసా ? ఈవిడ పేరు రాజేశ్వరి.
ప్రముఖ నటి శ్రీదేవి కి తల్లి. భార్యాభర్తలు సినిమా తర్వాత శాంతినివాసం సినిమాలో కృష్ణకుమారి కి చెల్లెలు గా నటించింది. కావాలంటే టీవీ లో శాంతినివాసం సినిమా వచ్చినప్పుడు 'కలనైనా నీ తలపే ' పాట దగ్గర బాగా చూడండి. చాలా చోట్ల క్లోజప్ లో కనిపిస్తుంది.

ఎన్టీయార్ కి సింగీతం ప్లేబ్యాక్


ఎన్టీయార్ , ఏయన్నార్ నటించిన 'శ్రీకృష్ణార్జున యుద్ధము' సినిమా గుర్తుండే ఉంటుంది. అందులోని 'అలిగితివా సఖి ప్రియా' పాట కూడా గుర్తుండే ఉంటుంది. ఆ పాట చిత్రీకరణ జరుగుతుండగా ప్లేబ్యాక్ మెషీన్ చెడిపోయింది. రిపేర్ చేయించడానికి ఛాలా పడుతుంది . ఈ లోగా టైం వేష్ట్ ఎందుకని కే.వీ. రెడ్డి గారికి అసిస్టెంట్ గా ఉన్నసింగీతం శ్రీనివాస రావు గారు తను పాడతానని, ఎన్టీ రామా రావు గారు లిప్ మూమెంట్ ఇస్తే చాలని అన్నారు. కే.వీ . రెడ్డి గారు "ఇదేమన్నా మ్యాజిక్కా .. ? టెక్నిక్ " అంటూ కోప్పడ్డారు . అప్పుడు ఎన్టీయార్ " ఓ సారి ప్రయత్నించి చూద్దాం " అన్నారు . ఆయన మాట కొట్టేయ్యలేక 'ఓ. కే." అన్నారు కే.వీ . రెడ్డి గారు. సింగీతం గారు పాడారు. ఎన్టీయార్ లిప్ మూమెంట్ మ ఇచ్చారు . తర్వాత ల్యాబ్ లో ప్రింట్ చేసి చూసుకుంటే లిప్ మూమెంట్ యధాతధం గా సరిపోయింది. సంగీతం మీద సింగీతం గారికున్న పట్టు అటువంటిది .

నాలుగు వందల సంవత్సరాల తర్వాతి గీతం ఇప్పుడే ...


అక్కినేని నాగేశ్వరరావు , భానుమతి కలిసి నటించిన 'విప్రనారాయణ ' సినిమా లోని 'సావిరహే తవ దీనా' అనే గీతం

గుర్తుండే ఉంటుంది. "ఎంత బావుందీ గీతం " అని విప్రనారాయణుడు అంటే "జయదేవ కవి కవిత్వమే అంత స్వామీ "

అంటుంది దేవదేవి - సినిమాలో. నిజానికి విప్రనారాయణుడు ఎనిమిదవ శతాబ్దానికి చెందిన వాడు జయదేవుడు

పన్నెండవ శతాబ్దానికి చెందిన వాడు. అంటే నాలుగు వందల సంవత్సరాల తర్వాత పుట్టాడన్నమాట.

నాలుగు వందల సంవత్సరాల తర్వాత పుట్టబోయే వారు రాయబోయే గీతాన్ని వర్తమానం లో పాడడం ఎలా సాధ్యం ?

ఎంత వరకు సబబు ? ఈ విషయాన్ని అప్పట్లో ప్రేక్షకులేవ్వరూ పట్టించుకోలేదు . సన్నివేశం , నటన బాగుంటే

ప్రేక్షకులు లాజిక్ జోలికి పోరనటానికి ఇదో ఉదాహరణ .