లతా మంగేష్కర్ తో తెలుగు సినిమాలో మొదటి సారి గా పాడించిన అలనాటి ప్రముఖ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణా మూర్తి గారు ఫిబ్రవరి తొమ్మిది రాత్రి తొమ్మిదిన్నరకి చెన్నై లో కన్ను మూశారు. చల్లని వెన్నెలలో (సంతానం), దేవీ శ్రీదేవీ (సంతానం), సలలిత రాగ సుధా రస సారం (నర్తనశాల), జననీ శివ కామినీ (నర్తనశాల), సఖియా వివరించవే (నర్తనశాల), చల్లని రాజా ఓ చందమామా (ఇలవేల్పు) లాంటి ఇవాళ్టికీ మర్చిపోలేని మధుర గీతాలెన్నో స్వర పరిచారాయన. ఎస్పీ బాలు ని సినీ పరిశ్రమకి పరిచయం చేసిన కోదండపాణి ఈయన కు అసిస్టెంట్ గా కొన్నాళ్ళు పనిచేసారు. అంచేత బాలు ఈయనని 'మా గుగ్గురువులు (గురువులకు గురువు)' అని అంటూ వుంటారు. సుసర్ల దక్షిణా మూర్తి గారి వయసు తొంభై ఏళ్ళు వుంటాయి. గత సంవత్సరం రేడియో మిర్చి అవార్డులకి జ్యూరీ సభ్యుడిగా వున్నప్పుడు ఈయనకి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ పట్టుబట్టి మరీ ఇప్పించాను. ఆ మహానుభావుడి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ -
Musicologist Raja
Friday, February 10, 2012
Great Music Director Susarla DakshinaMurthy is no more సుస్వర సుసర్ల ఇక లేరు
లతా మంగేష్కర్ తో తెలుగు సినిమాలో మొదటి సారి గా పాడించిన అలనాటి ప్రముఖ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణా మూర్తి గారు ఫిబ్రవరి తొమ్మిది రాత్రి తొమ్మిదిన్నరకి చెన్నై లో కన్ను మూశారు. చల్లని వెన్నెలలో (సంతానం), దేవీ శ్రీదేవీ (సంతానం), సలలిత రాగ సుధా రస సారం (నర్తనశాల), జననీ శివ కామినీ (నర్తనశాల), సఖియా వివరించవే (నర్తనశాల), చల్లని రాజా ఓ చందమామా (ఇలవేల్పు) లాంటి ఇవాళ్టికీ మర్చిపోలేని మధుర గీతాలెన్నో స్వర పరిచారాయన. ఎస్పీ బాలు ని సినీ పరిశ్రమకి పరిచయం చేసిన కోదండపాణి ఈయన కు అసిస్టెంట్ గా కొన్నాళ్ళు పనిచేసారు. అంచేత బాలు ఈయనని 'మా గుగ్గురువులు (గురువులకు గురువు)' అని అంటూ వుంటారు. సుసర్ల దక్షిణా మూర్తి గారి వయసు తొంభై ఏళ్ళు వుంటాయి. గత సంవత్సరం రేడియో మిర్చి అవార్డులకి జ్యూరీ సభ్యుడిగా వున్నప్పుడు ఈయనకి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ పట్టుబట్టి మరీ ఇప్పించాను. ఆ మహానుభావుడి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ -
Thursday, February 9, 2012
Re-recording with Ilayaraja's inspiration ఇళయరాజా ఇన్స్పిరేషన్ తో 'ఋషి' లో రీ రికార్డింగ్
ఎల్వీ ప్రసాద్ గారి అబ్బాయి శ్రీ రమేష్ ప్రసాద్ ఓ రియల్ జెంటిల్ మాన్ . ఏక్ దూజే కే లీయే తర్వాత దాదాపు ఇరవై ఏళ్లుగా చిత్ర నిర్మాణానికి దూరంగా వున్న ప్రసాద్ ప్రొడక్షన్స్ పేరిట మళ్ళీ ఓ సినిమాని నిర్మించారు. ఆ సినిమా పేరే 'ఋషి'.
తండ్రి ఎల్వీ ప్రసాద్ గారిలాగే రమేష్ ప్రసాద్ గారు విలువలకు ప్రాదాన్యత నిచ్చే వ్యక్తి కావడం తో ఆయన నిర్మించిన ' ఋషి' సినిమాలో కూడా ఆద్యంతం ఓ కమిట్ మెంటు, విలువలు కనిపిస్తాయి. చవకబారు హాస్యం, దిగజారుడు శృంగారం మచ్చుకైనా వుండవు. సినిమా పూర్తయ్యాక బరువెక్కిన గుండెతో నిశ్శబ్దం గా బైటికి వస్తాం .
మనకి మైండ్ పని చేస్తోందో లేదో, గుండె అసలు వుందో లేక బండ బారి పోయిందో మనకే అర్ధం కాని విధంగా వుంటుంది కొన్నిసినిమాలు చూస్తుంటే ! సరైన ప్రత్యామ్నాయం లేక అటువంటి సినిమాలనే చూస్తుంటాం ఒక్కోసారి. అంతకన్నాఅప్పుడప్పుడు ఇలాటి గుండె బరువెక్కే సినిమాలు చూడడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. మంచిని గౌరవించని వారు చెడు గురించి మాట్లాడే హక్కు ని ఆటోమాటిక్ గా కోల్పోతారు కాబట్టి మంచి సినిమాలు రావడం లేదు అని కంప్లయింట్ చేసే వారు ఇలాటి సినిమాలు వస్తే ఎలా స్పందిస్తున్నాం అంటూ ఆత్మ విమర్శ చేసుకునే సమయం ఇది అని అనిపిస్తుందీ సినిమా చూశాక.
సినిమా బిగినింగ్ లోనే ఓ బ్యూటిఫుల్ డైలాగ్ - 'ఇక్కడ సిగిరెట్ కాల్చుకోవచ్చా ... ఇది నాన్ స్మోకింగ్ జోనేనా ?' అడుగుతాడో జర్నలిస్ట్ . 'అసలు హ్యూమన్ బాడియే ఓ నాన్ స్మోకింగ్ జోన్' జవాబిస్తాడు డాక్టర్ - సినిమా నిండా ఇలాటివెన్నో.
ఇదంతా ఒక ఎత్తు. ఈ సినిమాకి సమకూరిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటీ ఒక ఎత్తు. ఇళయరాజా ఇన్స్పిరేషన్ తో చేసారా అన్నంత ఎఫెక్టివ్ గా వచ్చింది రీ రికార్డింగ్. చేసింది ఎవరని ఇంట్రవెల్ లో ఎంక్వయిరీ చేస్తే - స్నిగ్ధ - అని చెప్పారు సినిమా యూనిట్ కి సంబందించినవారు. ఆశ్చర్య పోయేంత లోగానే - తర్వాత లాయర్ వేషం లో కనిపిస్తుంది చూడండి - అన్నారు. తీరా చూస్తే 'అలా మొదలయింది' సినిమాలో టిపికల్ గా కనిపించే ( తమ్ముడు లేడీసా)అమ్మాయే ఈ స్నిగ్ధ. మొట్ట మొదట సింగర్ గా ప్రయత్నించిందిట అలా మొదలయింది లో ... కానీ వేషం వెయ్యాల్సి వచ్చింది. 'అల్లం వెల్లుల్లి ' సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసిందట. సినిమా అయిపోయిన తర్వాత మరి కాస్త ఎంక్వయిరీ చేస్తే తెలిసాయీ విషయాలు . ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ కి మాత్రం హ్యాట్సాఫ్ టు స్నిగ్ధ.
ఈ 'ఋషి' సినిమా ఎలాగూ జాతీయ అవార్డుల్ని సాధించుకుంటుంది కనుక స్నిగ్ధ ఎఫర్ట్స్ ని ప్రాంతీయ స్థాయి లో నైనా ప్రశంసించడం మన కర్తవ్యం.
Tuesday, February 7, 2012
Trivikram - Sirivennela - Arudra - Atreya త్రివిక్రమ్ - సిరివెన్నెల - ఆరుద్ర - ఆత్రేయ
మా మ్యూజిక్ అవార్డుల్లో సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన స్పీచ్ కి
స్పందించని వారు లేరు. యూ ట్యూబ్ లోనూ , పేస్ బుక్కుల్లోనూ తెగ పెట్టేశారా వీడియో ని.
'ప్రాగ్దిశ వీణియ పైన -
దినకర మయూఖ తంత్రుల పైన -
జాగృత విహంగ తతులే -
వినీల గగనపు వేదిక పైన'
అంటూ సీతా రామ శాస్త్రి గారు 'సిరివెన్నెల' లో రాసిన పాట విని డిక్షనరీ చూసానన్నాడాయన.
నిజం ... ఆ మాటల్లోని ప్రతి పదానికి అర్ధం చాలామంది పెద్దవాళ్ళకి కూడా తెలియదు.
ప్రాగ్దిశ = తూరుపు దిక్కు, మయూఖము = కిరణము, జాగృత = మేలుకున్న , విహంగము = పక్షి, తతి = సముదాయము , గగనము = ఆకాశం -
అని విడమర్చి చెపితే కానీ తెలుసుకోలేని పరిస్తితుల్లోనే వున్నాం మనం.
ఓసారి ఓ ప్రముఖ దిన పత్రిక ఈ పాట సాహిత్యాన్ని ప్రచురిస్తూ 'తతి' ఏమిటండీ 'గతి' అని ఉండాలేమో అని నన్ను అడగడం జరిగింది. దానికి అర్ధం చెప్పాక "అలాగా ... ఇలాంటి మాటలు సినిమా పాటల్లో ఎవరూ వాడరు కదండీ" అని అన్నారు.
"బాల భారతం సినిమాలోని ' మానవుడే మహనీయుడు' పాటలో ఆరుద్ర గారు వాడారండీ -
గ్రహరాశులనధిగమించి ,
ఘన తారల పథము నుంచి ,
గగనాంతర రోదసిలో
గంధర్వ గోళ తతులు దాటి -
అంటూ రాశారండీ "
అని వివరించాను.
ఇటువంటిదే మరొక సంఘటన. ఓ పెద్దాయన, సినీ రచయిత కూడా ... మాటల సందర్భం లో చెప్పారు
"ఓ కుగ్రామం లో ఓ పెళ్లి కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ' సేస ' పట్టండి అన్నారు. నాకు అర్ధం కాలేదు. చేతికి అక్షతలు ఇచ్చారు. అప్పుడు తెలుసుకున్నాను అక్షతల్ని సేసలంటారని."
వెంటనే అన్నాను " ఆత్రేయ గారు ఇదెప్పుడో రాశారు కదా !? " అని.
" ఆత్రేయా ... ఏం రాశాడు ? " అడిగారాయన
" ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో పాటలో - మూగ మనసు బాసలు మీకిద్దరికీ సేసలు - అని రాయలేదా ?" అన్నాను. ఆ పెద్దాయనకి చిన్న కోపం వచ్చింది. ఆయన చనిపోయి చాలా కాలం అయింది. అంచేత పేరు రాసి ఆయన పట్ల నాకున్న గౌరవ భావానికి కళంకం తెచ్చుకోలేను.
మన భాషకి సంబందించిన కనీస జ్ఞానాన్ని సినిమా పాటల ద్వారా కూడా పెంపొందించుకోవచ్చు అని తెలియచెప్పడానికే ఈ ఉదాహరణలు.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే - నచ్చిన సినిమా పాటల్ని కేవలం విని వూరుకోకండి. వీలయితే ఆ పాట సాహిత్యాన్ని రాసి చూసుకోండి. మీ భాషా జ్ఞానం లో కచ్చితంగా మీకు తెలియకుండానే మార్పు వచ్చేస్తుంది. శని ఆది వారాల్లో కనీసం ఒక తెలుగు పాటనైనా విని రాయమని, అలా రాసి చూపిస్తేనే బైటికి తీసుకెళ్తానని మీ పిల్లల్ని ఊరించి చూడండి. సినిమా పాట కనుక ఆకర్షణ సహజం. ఫలితం అద్భుతం.
మన పిల్లలకి తెలుగు రావాలంటే ఇంతకు మించిన సులువైన మార్గం లేదు ప్రస్తుతానికి.
Sunday, February 5, 2012
Hearts off to Shreya Goshal హార్ట్సాఫ్ టు శ్రేయా గోషల్
నా అనుకున్న వాళ్ళు
మన అనుకున్న వాళ్ళు
ఇంచుమించు ప్రతి ఒక్కరూ ...
మనల్ని ఒంటరిగా ఒదిలేసే క్షణాలు చాలా సార్లు వుంటాయి జీవితంలో .
ఎవరి కారణాలు వారికి వుంటాయి.
మనం మాత్రం ఒంటరిగా మిగిలిపోతూవుంటాం.
ఒక్కో సారి సమూహంలో కూడా ఏకాంతం అయిపోతూ వుంటాం.
మనసులోనా ... మస్తిష్కం లోనా ...
ఆలోచనలోనా .. అనుభూతిలోనా ...
ఎక్కడో ఏమిటో తెలియని గ్లాని
ఎందుకో చెప్పలేం గాని ....
అప్పుడో అమృత స్పర్శ ...
భగవంతుడు మనకోసమే పంపినట్టు !
ఓ చల్లటి వెలుగు...
మెల్లగా పాకుతూ, మనసంతా పరుచుకుంటూ... !!
ఎక్కిళ్ళతో ఎగసి పడుతున్నగుండె ...
నిశ్శబ్దంగా రోదిస్తూంటే ...
ఉబుకుతున్న కన్నీటి బిందువుల్లో ఓ తియ్యటి తృప్తి !!!
ఈ క్షణాన ఈ ప్రాణాలు ఇలాగే పోతే బాగుణ్ణు అనుకునేలా ...
ఈ అలౌకిక ఆనందం అందరికీ పంచడం కోసం బ్రతకాలనుకునేలా ...
ఈ అనుభూతులన్నిటినీ సంగీతం ద్వారా అందించగలమా ?
ఒకవేళ స్వరపరిస్తే ...
ఆపాత మధురమైన ఆ సంగీతానికి
ఆలోచనామృత తుల్యమైన సాహిత్యం సహాయం అవసరమా ?
అనుభవైకవేద్య మైన ఆ మాధుర్యానికి ఆలాపనలు సరిపోవా ?
అది సరి అయితే - అందుకు సరితూగ గల స్వరం వుందా ...? అసలుంటుందా ?
ఉన్నా ఆ స్వరానికి ఈ అనుభూతిని ఆవిష్కరించగల సామర్ధ్యం వుంటుందా ?
అదీ వున్నా ,,,
ఆ సామర్ధ్యానికి - గుండె తడిని కంటి చెమ్మ గా మార్చి ప్రవహింప చేసే - హృదయం వుండే అవకాశం వుందా ?
సుస్వర సంగీతప్రియుల కోసం ఆ సరస్వతీ దేవి రెహమాన్ మేధస్సులో సృష్టించిన ఓ ప్రయోగాన్ని ఈ ప్రశ్నల రూపంలోకి మార్చుకుంటే అందుకు వచ్చే సమాధానం శ్రేయా గోషల్ , నిదర్శనం 'ఏక్ దివానా థా' సినిమా ఆడియోలో 'బ్రేకింగ్ ప్రామిసెస్' పేరుతో ఆమె ఆలపించిన ఆలాపనలు.
తెలుగులో వచ్చిన 'ఏ మాయ చేసావె', తమిళంలో వచ్చిన 'విన్నైత్తాండి వరువాయా' చిత్రాల హిందీ వెర్షనే 'ఏక్ దివానా థా'. తెలుగు తమిళ చిత్రాల్లోని ట్యూన్ లన్నీ హిందీ వెర్షన్ లోనూ వున్నాయి. అవి కాక మరికొన్ని అదనంగా కూడా వున్నాయి . వాటిలో ఒకటి శ్రేయా గోషల్ తో రెహమాన్ పాడించిన ఈ ఆలాపన. 'ఆరోమలై' అన్న పదమొక్కటె ఇందులోని సాహిత్యం. తక్కినదంతా ఆలాపనే. ఆరోమలై అన్నది మలయాళ పదం. తెలుగులో 'నా ప్రియతమా' దానికి దీటైన అర్ధం అని మా అమ్మాయి సుమ (ప్రముఖ యాంకర్) చెప్పింది.
ఈ ఆలాపన భాగేశ్వరి రాగం లో వుంది. ఉత్తరాదిన దీన్ని భాగేశ్రీ అని అంటుంటారు. మంటలు రేపే నెలరాజా (రాము), రారా కనరారా (జగదేక వీరుని కథ), నైన్ సే నైన్ నాహీ మిలా (ఝనక్ ఝనక్ పాయల్ బాజే) వంటి సినీ గీతాలు ఈ రాగానికి మంచి ఉదాహరణలు. శోక తప్త విరహం ఈ రాగంలో బాగా పలుకుతుంది. గుండెలు పిండే తత్వం ఈ రాగం లో ఒదుగుతుంది.. రెహమాన్ ఇవన్నీ తెలిసిన వాడు కావడం చేత ఈ రాగం లోని జీవస్వరాలన్నిటినీ పిండి శ్రేయా గోషాల్ అనే మకరంద మాధుర్యం తో కలగలిపి సుస్వరానికి పులకించిపోయే శ్రోతలకు ఒక మరపురాని కానుకగా సమర్పించాడు.
రెహమాన్ ఇంతటి వాడు, అంతటి వాడు అని ఇవాళ ప్రత్యేకించి చెప్పవలసిన అవసరమూ లేదు. అది కొత్త విషయమూ కాదు. కానీ శ్రేయా గోషల్ గురించి మాత్రం చెప్పుకోవాలి. రెహమాన్ ఇచ్చింది ఇచ్చినట్టు పాడి వుంటే ఆమె గ్రాహ్యతని మెచ్చుకోవాలి. లేక రాగ స్వభావం చెప్పేసి ఆలపించుకుంటూ పొమ్మంటే ఆమె కల్పనా శక్తికి జోహార్లు చెయ్యాలి. ఎలా చూసినా హ్యాట్సాఫ్ ... సారీ ... హార్ట్సాఫ్ టు శ్రేయా గోషల్.
'ఏక్ దివానా థా' లోని ఈ ఆలాపనని అసలు ఏ పాటతోనూ కలిపి వినకండి. అంతకంటే ముందు మీ నుంచి మీ హృదయాన్ని బైటికి పంపేయండి. పంపే ముందు ఈ ఆలాపన ని ఇచ్చివినమని చెప్పండి. తర్వాత అది ఎంత అనందం తో మీ దగ్గరికి వస్తుందో మీకే తెలుస్తుంది. అలా జరక్కపోతే భగవంతుడనే డాక్టర్ మీ గురించి ఇచ్చే స్కానింగ్ రిపోర్ట్ చూసి చాలా బాధ పడవలసి వుంటుంది
Thursday, February 2, 2012
Another song on friendship from 'Nippu' స్నేహాన్ని తెలిపే మరో పాట - 'నిప్పు' నుంచి
ఫ్రెండ్ షిప్ కి సంబంధించి మరో సినిమా పాటొకటి వచ్చింది.
' ఆలీబాబా ఆలీబాబా - ఇట్సోకే బాబా డోంట్ వర్రీ బాబా'
అంటూ 'నిప్పు' సినిమా కోసం విశ్వ రాశాడు. పాట గురించి చెప్పే ముందు విశ్వ గురించి చెప్పాలి. రచయిత, స్వరకర్త , గాయకుడు ఈ మూడిటిలో ఎప్పుడు ఎలా కావాలంటే అలా మారిపోయి మాంచి రిజల్ట్ ఇవ్వగల సమర్ధుడితను. ఒక్కోసారి మూడు తానే అయిపోయి తన పాట తోనే సినిమాకి గుర్తింపునివ్వగల త్రిముఖ ప్రజ్ఞాశాలి కూడా (ఉదా : పడితినమ్మో... నేను- నా రాక్షసి) .
'పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే ' (అతడు) లాంటి ఆలోచింప చేసే ప్రయోగాలూ,
'గీత విను దొరకదు గుణ గణమే - చేవగల చతురత కణకణమే - చీడలను చెడమడ దునమడమే - నేటి మన అభినవ అభిమతమే - ఓటమిని ఎరుగని పెను పటిమే - పాదరస ఉరవడి నరనరమే -సమరమే సై ఇక చలగిక చకచక - ఎడతెగ చెయ్ ఇక విలయపు తైతక ' (దూకుడు) లాంటి టంగ్ ట్విస్టింగ్ పదాలతో ట్యూన్ లోని చెడుగుడుతనాన్ని మరింత ఆకర్షణీయం గా మలచగల పదకేళి విలాసం - ఇవన్నీ విశ్వకి పెన్ను తో పెట్టిన విద్యలు .
ఈ 'ఆలీ బాబా ' పాటలో కూడా ఫ్రెండ్ షిప్ మీద కొటేషన్ లాగ వాడుకోదగ్గ చరణం ఒకటి రాశాడు.
' నమ్మకాల దొంతరల్లో పుట్టేదీ - అంతరాల అడ్డుకట్ట నెట్టేదీ - నిన్నోడ నివ్వనీ తోడూనీడిదీ -
స్నేహమన్న ఒక్క నీతి కారణాన - రారాజు కూడ చేరెలే స్వర్గానా - మైత్రి మారునా యుగాలు మారినా '
ఇది ఆ పాటలో ఆఖరి చరణం. రెండో చరణం లో తన పదకేళీ విలాసాన్ని మరోసారి చూపించాడు. ' జత నస వస పిసినారైనా ' అన్నాడు. జత అంటే జతగాడు (స్నేహితుడు) . వాడు ఎంత నస గాడైనా, వస పోసిన పిట్ట లా ఎంత వాగుడు కాయైనా, ఆఖరికి పరమ పిసినారైనా ఫ్రెండంటే ఫ్రెండేగా . లోపాలతో సహా ప్రేమించే వాడేగా ఫ్రెండంటే. అందుకే ' ఏ దోస్ తీ గమ్మత్తుదీ ' అన్నాడు పల్లవి లో . ( దోస్తీ ని అలా వేరు చెయ్యకూడదు అనకండి. ఆర్డీ బర్మన్ అంతటి వాడే ' ఏ ... దోస్ తీ - హమ్ నహీ చోడెంగే' అంటూ ట్యూన్ చేసాడు).
నిజానికి ఏ దోస్ తీ అన్నదే ఆసలు పల్లవి. 'ఆలీబాబా ఆలీబాబా ఇట్సోకే బాబా డోంట్ వర్రీ బాబ' అన్నవి హుక్ లైన్లు. ఇవి తమన్ ఇచ్చినవే అయివుంటాయి. ఎందుకంటే - 'ముస్తాఫా ముస్తాఫా డోంట్ వర్రీ ముస్తాఫా' అన్నాడు గా ఏ. ఆర్. రెహమాన్. అతను 'ముస్తఫా' ను పాపులర్ చేస్తే మనం 'ఆలీబాబా' ని పాపులర్ చేద్దాం అనుకోవచ్చు. క్రియేటివ్ ఫీల్ల్ద్ లో ఇలాటివి తప్పు కానే కాదు. ఏ ప్రయోగమూ చెయ్యకపోతే అది క్రియేటివిటీ ఎలా అవుతుంది ? పైగా తమన్ ఈ పాటకి మిక్కి జే మేయర్ లా ' తడి కన్నులనే తుడిచే నేస్తమా ' లాంటి సెంటిమెంట్ రూట్ ని కాకుండా - రెహమాన్ చూపించిన 'ముస్తఫా' లాంటి ఫుల్ జోష్ రూట్నే నమ్ముకున్నట్టున్నాడు.అందుకే ఈ ' ఆలీబాబా ' అలాంటి 'జోష్ ఫుల్' ట్యూన్ ఇచ్చాడు. బీట్ లోనూ, ఆర్కేష్ట్రయిజేషన్ లోనూ మధ్య మధ్య' గురువారం మార్చ్ ఒకటి ' (దూకుడు) గుర్తొస్తూ వుంటుంది. అది గుర్తొస్తూ వుంటుందో లేక మనం దాన్ని మర్చిపోలేకపోతున్నామో !? ఎనీ వే
వీటన్నిటిని మించినది ఈ పాటని జావేద్ ఆలీ తో పాడించడం . అతని వాయిస్ భలేగా సూట్ అయిందీ పాటకి.
జావేద్ ఆలీ గురించి చెప్పాలిక్కడ. అసలు పేరు జావేద్ హుస్సేన్ . ప్రముఖ గజల్ సింగర్ ఉస్తాద్ గులాం ఆలీ దగ్గిర శిష్యరికం చేశాడు కనుక గురునామం స్వీకరించి తన పేరులో కలుపుకున్నాడు. ఎంత మంచి సంస్కారమో కదా !? 'జోధా అక్బర్' లోని 'కేహేనేకొ జష్న్- ఎ - బహారా హే '(Jashn-E-Bahaaraa)
పాట ద్వారా అందరికీ తెలిశాడు. రెహమాన్ ఇలాటి వాళ్ళని వెతికి మరీ పట్టుకుంటాడు. తర్వాత తెలుగులో - రామ్ నటించిన 'గణేష్' లో 'తనేమందో' అనే ఓ మంచి పాట చాలా బాగా పాడేడు. సినిమా హిట్ కాకపోవడంతో పాట పాపులర్ కాకుండా పోయింది. తర్వాత'మహం మహమాయే ' (కొమరం పులి), 'ఏవో పిచ్చి వేషాలు' (వాంటెడ్) రావా సక్కని రసగుల్లా ( శక్తి లో సుర్రా సుర్రన్నాడే) పాటలు పాడేడు.
తమన్ రెహమాన్ రూట్ నే నమ్ముకున్నాడనడానికి మరో చిన్న ఉదాహరణ కనబడుతోందీ పాటలో. 'ఏ మాయ చేసావే ' లో 'కుందనబ్బొమ్మ' పాట గుర్తుందా ? అందులో 'నీ పాదం నడిచే ' దగ్గర బెన్నీదయాళ్ 'ఊ ఊ ఊ ఊ' అంటూ పాడతాడు. ఈ 'ఆలీబాబా' పాటలో జావేద్ ఆలీ తో రెండో చరణం ఎండింగ్తర్వాత అలా అనిపించడానికి ట్రయ్ చేసాడు తమన్. కుందనబ్బొమ్మ పాటలో ఉన్నంత లెంగ్త్ వుండదు గానీ దాన్ని మాత్రం గుర్తు చేస్తూ వుంటుంది.
పాటని మామూలు గా వినండి ... తర్వాత లిరిక్ ఎదురు గా పెట్టుకుని వినండి ... ఆ తర్వాత పాడడానికి ప్రయత్నిస్తూ వినండి. కచ్చితంగా ఈ మూడు దశల్లోనూ మీ అభిప్రాయాల్లో కలిగే మార్పు ని మీరే గమనిస్తారు.
ఆలీబాబా ఆలీబాబా
ఇట్సోకే బాబా డోంట్ వర్రీ బాబా
లెట్స్ గో (లేట్ అస్ గో)
ఏ దోస్ తీ గమ్మత్తుదీ
పణవెట్టే ప్రాణం సైతం తృణ మంటుందీ
ఏ దోస్ తీ గమ్మత్తుదీ
ఉండగానే మిత్రుడు అన్ని తానై
పైసలతో పనేమి సబ్ అప్ నా హై
చలో పదా మరీ జమానా జీత్ నే
అల్లుకున్న ఆశలేరా ప్రేమంటే
ఆశ లేని పాశమేర మైత్రంటే
కాన ఎప్పుడూ ఫ్రెండ్స్ లవ్ యూ
// ఆలీ బాబా //
జత నస వస పిసినారైనా
చెల్లుర సుమతీ
............
లోకమంత వింటదీ చెప్పేదీ
చెప్పలేక వున్న వింటదీ ఈ దోస్తీ
అందుకే ఇదీ సాటిలేనిదీ
// ఆలీ బాబా //
నమ్మకాల దొంతరల్లో పుట్టేదీ
అంతరాల అడ్డుకట్ట నెట్టేదీ
నిన్నోడ నివ్వనీ తోడూనీడిదీ
స్నేహమన్న ఒక్క నీతి కారణాన
రారాజు కూడ చేరెలే స్వర్గానా
మైత్రి మారునా యుగాలు మారినా
// ఆలీ బాబా //
Tuesday, January 31, 2012
Attitude of Mahesh Babu మహేష్ బాబు ధోరణి ఇలా వుంది
నిన్ననే పని మీద సీతా రామ శాస్త్రి గారింటికి వెళ్లాను.అప్పుడే ఓ పాట పూర్తి చేసి,ఆ ఆనందం లో
వున్నారాయన.'కొత్త బంగారు లోకం ' సినిమాని తీసిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో దిల్ రాజు గారు తీస్తున్న 'సీతమ్మ వాకిటిలో సిరిమల్లె చెట్టు' కోసం రాసిన పాట అది. ఆ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటిస్తున్నారని అందరికీ తెలుసు.మా మధ్య మాటలు మొదలవుతూ ఉండగానే వచ్చేశారు దిల్ రాజు. రాసిన పాటని వినిపించారు శాస్త్రి గారు.సాధారణం గా పాట ని వినిపించినప్పుడు తన స్వంత బాణీ లో వినిపించడం శాస్త్రి గారి స్టయిల్. కానీ ఈ పాటని మాత్రం మిక్కి జే మేయర్ ఇచ్చిన tune లోనే వినిపించారాయన . అంటే ఆ tuneఅంత బాగా రిజిస్టర్అయిపోయిందన్నమాట ఆయనలో. దిల్ రాజు గారికి లిరిక్స్ నచ్చేశాయి. శాస్త్రి గారు రాసిన వెర్షన్స్ లో తనకు కావలిసినవి టిక్కు పెట్టుకుని 'ఇవి తీసుకుంటాను' అన్నారు. 'నీ ఇష్టం ... నీకేది నచ్చితే అదే తీసుకో ' అన్నారు శాస్త్రి గారు.'అన్నీ బావున్నాయి.కానీ నేను టిక్కు పెట్టినవి ఇంకా ఎక్కువ బావున్నాయి' అన్నారు దిల్ రాజు. 'అన్నీఇంత బాగా రావడానికి కారణం మహేష్ బాబు యాటిట్యూడ్' అన్నారు శాస్త్రి గారు. 'నిజం గా అది మాత్రం గ్రేటండీ ' అన్నారు దిల్ రాజు. ఏంటన్నట్టుచూశాను. 'ఈకథని మేం దూకుడు,బిజినెస్ మాన్ షూటింగ్ మొదలు కాకముందు వినిపించాం అదే చెబుతూ ఇవాళ ఆ రెండూ హిట్ అయ్యాయని కథలో ఏ మార్పులూ చెయ్యకండి. నాకెలా వినిపించారో అలాగే తియ్యండి అన్నారు మహేష్ బాబు' అని వివరించారు దిల్ రాజు.
వున్నారాయన.'కొత్త బంగారు లోకం ' సినిమాని తీసిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో దిల్ రాజు గారు తీస్తున్న 'సీతమ్మ వాకిటిలో సిరిమల్లె చెట్టు' కోసం రాసిన పాట అది. ఆ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటిస్తున్నారని అందరికీ తెలుసు.మా మధ్య మాటలు మొదలవుతూ ఉండగానే వచ్చేశారు దిల్ రాజు. రాసిన పాటని వినిపించారు శాస్త్రి గారు.సాధారణం గా పాట ని వినిపించినప్పుడు తన స్వంత బాణీ లో వినిపించడం శాస్త్రి గారి స్టయిల్. కానీ ఈ పాటని మాత్రం మిక్కి జే మేయర్ ఇచ్చిన tune లోనే వినిపించారాయన . అంటే ఆ tuneఅంత బాగా రిజిస్టర్అయిపోయిందన్నమాట ఆయనలో. దిల్ రాజు గారికి లిరిక్స్ నచ్చేశాయి. శాస్త్రి గారు రాసిన వెర్షన్స్ లో తనకు కావలిసినవి టిక్కు పెట్టుకుని 'ఇవి తీసుకుంటాను' అన్నారు. 'నీ ఇష్టం ... నీకేది నచ్చితే అదే తీసుకో ' అన్నారు శాస్త్రి గారు.'అన్నీ బావున్నాయి.కానీ నేను టిక్కు పెట్టినవి ఇంకా ఎక్కువ బావున్నాయి' అన్నారు దిల్ రాజు. 'అన్నీఇంత బాగా రావడానికి కారణం మహేష్ బాబు యాటిట్యూడ్' అన్నారు శాస్త్రి గారు. 'నిజం గా అది మాత్రం గ్రేటండీ ' అన్నారు దిల్ రాజు. ఏంటన్నట్టుచూశాను. 'ఈకథని మేం దూకుడు,బిజినెస్ మాన్ షూటింగ్ మొదలు కాకముందు వినిపించాం అదే చెబుతూ ఇవాళ ఆ రెండూ హిట్ అయ్యాయని కథలో ఏ మార్పులూ చెయ్యకండి. నాకెలా వినిపించారో అలాగే తియ్యండి అన్నారు మహేష్ బాబు' అని వివరించారు దిల్ రాజు.
'అదే రాజూ ఆ యాటిట్యూడే నాకు తెగ నచ్చేసింది.' అన్నారు శాస్త్రి గారు. సాధారణం గా ఓ రెండు సినిమాలు క్లిక్ అయితే 'నా నుంచి జనం ఇలాటివే ఎక్స్ పెక్ట్ చేస్తారు ' అంటూ కథలో మార్పులు సూచిస్తూ వుంటారు కొంతమంది. దాంతో వెరైటీ చేద్దాం అంటే కుదరక రొటీన్ కి వచ్చేస్తారు. అన్దుకు భిన్నంగా నిజంగా ఇదే ధోరణి లో మహేష్ బాబు కొనసాగితే కథల్లో వైవిధ్యం ఉండడానికి అవకాశం వుంటుంది. ఈ లెక్కన 'సీతమ్మ వాకిటిలో సిరిమల్లె చెట్టు' సినిమా ఆ టైటిల్ లాగే బ్యూటిఫుల్ గా తయారవుతుందని అనిపిస్తోంది.
Sunday, January 29, 2012
Nippu Title Song ....నిప్పు టైటిల్ సాంగ్ గురించి ..
వేగ వేగ వేసెయ్యెర అడుగు
వేగం అంటే గాలిని అడుగు
గాలిని తాకి మబ్బే కరుగు
మబ్బే కరిగి చినుకై దూకు
చినుకు చినుకు ఏరై ఉరుకు
ఏరే కడలై నీరై పొంగు
నీరే పొంగి నిప్పై మరుగు
నిప్పెవరంటే నన్నే అడుగు
అడుగులు అడుగులు పిడుగులు అడుగులు
చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు
మనసుకి భయపడు మనసుల జతపడు
మనసును గెలిచిన మనిషే దేవుడు
ఇదీ చంద్రబోస్ 'నిప్పు' సినిమా కోసం రాసిన పాట. ఇది ట్యూన్ కి రాసిన పాట. సాధారణంగా సంగీత దర్శకుడు ట్యూన్ ఇచ్చేటప్పుడు డమ్మీ లిరిక్స్ తో గాని 'తత' కారాలతో గానీ ఇస్తాడు. ఇక్కడ సంగీత దర్శకుడు తమన్ తన ట్యూన్ ని బోస్ కి 'తత' కారాలతో ఇచ్చాడు. వీటికి సాహిత్యం సమకూర్చాలి. సాహిత్యం సమకూర్చడం అంటే అక్షరాల పేర్పు కాదు. భావాలతో అక్షరాల కూర్పు. 'ఇదేమిటీ , ఎందుకూ' అని అడిగితే వివరించి ఒప్పించగలిగే నేర్పు వుండాలి రచయితకి. అప్పుడే ప్రేక్షక శ్రోతల తీర్పు బాగుంటుంది. గర్భం లో ప్రాణం పోసుకున్న జీవాన్ని ప్రపంచం లోకి పంపించడానికి తల్లి ఎంతటి ప్రసవ వేదన అనుభవిస్తుందో , గుండెల్లో రూపు దిద్దుకున్న భావాన్ని అక్షర ప్రపంచం లోకి పంపించడానికి అంతటి అంతర్మధనాన్నీ అనుభవిస్తాడు కవి. ఈ పాట పల్లవి రాయడానికి 15 రోజులు పట్టింది చంద్రబోస్ కి. మొట్ట మొదటి కారణం ట్యూన్.
ఈ ట్యూన్ ని 'తత' కారాల తో అనుకుంటూ చంద్రబోస్ ఇచ్చిన సాహిత్యం తో కంపేర్ చేసుకుంటూ చూడండి ... కష్టం తెలుస్తుంది. కష్టం ఎందుకూ అంటే చాలా సవాళ్లు ఉన్నాయి నేటి సినీ రచయితకి. అందులో హీరో ఇమేజ్ మొదటిది. తరువాత సంగీత దర్శకుడు, దర్శకుడు, నిర్మాత తో గల సంబంధ బాంధవ్యాలు. (అప్పుడే కథ, కథతో ఈ పాటకి గల ప్రాదాన్యత తెలుస్తుంది రచయితకి. కట్ చేస్తే డ్యూయెట్ అండీ .. మాంఛి డ్యూయెట్ఒకటి ఇరగ దియ్యాలిక్కడ ... అని కథ చెప్పకుండా పాట రాయించుకునే రోజులు కదా) అందుకని ఎంత ఒద్దనుకున్నా ఇవన్నీ మైండ్ లో అండర్ కరెంట్ గా వర్క్ అవుట్ అవుతూనే వుంటాయి రచయితకి.
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ - ఏకాగ్రతకి ఇవి అడ్డు రాకుండా రాయాలి. అదీ సవాల్.
హీరో రవితేజ డైలాగ్ డెలివరీ నుంచి పెర్ఫార్మెన్స్ దాకా స్పీడు వుంటుంది. అంచేత - వేగ వేగ వేసెయ్యర అడుగు. ఇది బిగినింగు. వేగ అనడం పాత పధ్ధతి. ( పాత సినిమా పాటల్లో వేగ రారా అనే పదాలుండేవి).
వేగం అంటే బావుంటుంది కానీ ట్యూన్ కి నప్పదు. ఆ పాత పదాలతో ఈ జనరేషన్ ని ఒప్పించాలంటే తర్వాతి లైన్స్ తో ఆకట్టుకోవాలి.
సినిమా పేరు నిప్పు . హీరో క్యారెక్టర్ ని తెలిపే టైటిల్ - ఈ టైటిలూ, ఆ క్యారెక్టరూ ఈ రెండూ పల్లవిలో వర్కవుట్ అయితే జనాలకి పట్టుకుంటుంది. కాబట్టి - నిప్పెవరంటే నన్నే అడుగు. ఇది కన్ క్లూజన్ .
ఇప్పుడు బిగినింగు నుంచి కన్ క్లూజన్ కి చేరే పద్ధతిలో - వాటికి వేసే లింకుల్లో రీజనింగ్ వుండాలి .
వేగం కి ఉదాహరణగా గాలిని చెప్పుకుంటాం కనుక - వేగం అంటే గాలిని అడుగు. ఆ తర్వాత ఇంక ఒకటే వరస - గాలిని తాకి మబ్బే కరుగు - మబ్బే కరిగి చినుకై దూకు -చినుకు చినుకు ఏరై ఉరుకు - ఏరే కడలై నీరై పొంగు - నీరే పొంగి నిప్పై మరుగు. కంక్లూజన్ కి వచ్చేసింది. నిప్పెవరంటే నన్నే అడుగు.
ఇక్కడ ఎవరికైనా కలిగే డౌట్ ఏమిటంటే - నీరు పొంగితే నిప్పుని ఆర్పుతుంది కానీ నిప్పై ఎలా మరుగుతుంది ? కానీ నీటి అడుగున బడబాగ్ని వుంటే ఆ నీరు మరిగి పొంగుతుంది. ఒక విధంగా ఇది హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే ఎక్స్ ప్రెషన్.
ఇక - అడుగులు అడుగులు పిడుగులు అడుగులు - చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు.
ఇలాంటి - టక టక టక టక - టైపు ట్యూన్లిస్తూ ఉంటాడు తమన్ . (కావాలంటే 'దూకుడు' టైటిల్ సాంగ్ ని గుర్తు చేసుకోండి - సమరమే సై ఇక చెలగిక చక చక - ఎడతెగ చెయ్ ఇక విలయపు తై తక). అటువంటి ట్యూన్ లకి పదాలు పేర్చినట్టు కాకుండా అర్ధవంతం గా ఉండేట్టు రాయాలి. సహ రచయితల ప్రయోగాలకు దీటుగా , పూర్వ కవుల ప్రయోగాలు రిపీట్ కాకుండా చెప్పాలి.
అందుకే - అడుగులు అడుగులు పిడుగులు అడుగులు -చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు .
అలా అని తను చెడు అనుకున్నవారినందరినీ నరుక్కుంటూ పోయే సైకాలజీ వుండకూడదు హీరోకి. తన మనసుకి తాను జవాబుదారి గా వుండాలి. అటువంటి నిజాయితీపరుల తోనే తను కలిసుండాలి. అందుకే - మనసుకి భయపడు. (అటువంటి) మనసుల(తో) జతపడు. ఇటువంటి మనసుల్ని గెలిచిన మనిషే దేవుడనిపించుకుంటాడు. హీరో అంటే అంతే కదా మరి !?
ఇదీ థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ లో అనుకున్నదంతా పల్లవిలో క్లియర్ గా వచ్చేస్తే చరణాలు ఆటోమాటిక్ గా పరుగెడతాయి. అదే జరిగిందీ పాటలో. ఈ ప్రాసెస్ ని దృష్టిలో పెట్టుకుని , సాహిత్యాన్ని దృష్టి ముందు పెట్టుకుని పాటని విని చూడండి.
వేగ వేగ వేసేయ్యర అడుగు
వేగం అంటే గాలిని అడుగు
గాలే తాకి మబ్బే కరుగు
మబ్బే కరిగి చినుకై దూకు
చినుకు చినుకు ఏరై ఉరుకు
ఏరే కడలై నీరై పొంగు
నీరే పొంగి నిప్పై మరుగు
నిప్పవరంటే నన్నే అడుగు
అడుగులు అడుగులు పిడుగులు అడుగులు
చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు
మనసుకు భయపడు మనసుల జతపడు
మనసుని గెలిచిన మనిషే దేవుడు
చరణం 1
ఎవర్ని ఫాలో కాను నాతో నేను పోతుంటాను
ఎవరికీ పోటి కాను నాకే నేను ఎదురొస్తాను
ఎవరితో పంతం లేదు నాతో నేను కలిసుంటాను
ఎవరికీ అర్ధం కాను నాకే నేను తెలిసుంటాను
ఎవరికీ వుండని దారుంది
వేరెవరికి చెందని తీరుంది
పరులెవరికి లొంగని ఫైరుంది
నేన్నాలా ఉంటె తప్పేముంది
ఎరగను ఎరగను ఎవరిని కెలుకుడు
కెలికితే జరుగును ఎముకల విరుగుడు
తొడగను తొడగను మనసుకి ముసుగును
మనిషిగ మసలిన మనిషే దేవుడు
చరణం 2
ఎటైనా వెళ్తుంటాను భారం లేదు తీరం లేదు.
ఏదైనా చేస్తుంటాను ఆశే లేదు హద్దే లేదు
ఎలాగో బతికేస్తాను స్వప్నం లేదు సొంతం లేదు
ఇలాగే గడిపేస్తాను గమ్యం లేదు లక్ష్యం లేదు
నిన్నటి గురుతే లేకుంది
మరి నేటికి కొరతే లేకుంది
మరునాటికి కలతే లేకుంది
ఏదీ లేకుంటే లేనిది ఏది
ఎగసిన పిలుపుకి బదులిక వినపడు
మెరిసిన కనులకి చెలిమిక కనపడు
తెరిచిన మనసుకి మనసుతో ముడిపడు
మనిషిగ ఎదిగిన మనిషే దేవుడు
@@@@@@@@@@
Thursday, January 26, 2012
Pl don't excuse us ... మేం ఇంతే ...
బాపు గారి పేరు పద్మ అవార్డులకు ఎంపిక కాకపోవడం ఇది ఎనిమిదో సారిట. తెలుగు వారందరూ తల్చుకుని తల్చుకుని సిగ్గుపడాల్సిన విషయం ఇది. అసలు మనకి సిగ్గుపడడానికి కూడా అర్హత ఉందా అనిపిస్తోంది. ఇప్పటి వరకు పద్మ అవార్డులు పొందిన తెలుగు వారిలో కొందరికైనా ఆత్మ విమర్శ చేసుకునేటంత సంస్కారం వుంటే సిగ్గు అనే పదానికి కనీసం అర్ధం అయినా తెలిసుండేది.
బాపు గారికి పద్మ అవార్డు రాకపోవటానికి అసలు కారణం ఏమై వుంటుంది ? శాంతా బయోటెక్ వర ప్రసాద రెడ్డి గారన్నట్టు 'భూపేన్ హజారికా గురించి మనకి తెలుసు. భీమ్ సేన్ జోషి గురించి తెలుసు. అలా మన బాపు గారి గురించి నార్త్ లో తెలియక పోవడానికి కారణం అక్కడి మీడియా . అక్కడ వాళ్ళ గురించి ఇక్కడ మనం ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ పరిశోధించి మరీ రాస్తాం. మనవాళ్ళ గురించి వాళ్ళు రాయరు . మనం పబ్లిసిటీ చేసుకోం. బాపు గారి గురించి చెబితే - సౌత్ లో కార్టూనిస్ట్ లు కూడా ఉన్నారా ? - అని ఆర్కే లక్ష్మణ్ అన్నారట. దీనికి కారణం కొంత వరకూ మీడియానే. '
నిజమే ... కొంత మీడియా అయితే.. మరికొంత రాజకీయ నాయకులు... తమకు కావలసిన సీట్లను, పదవులను పట్టు పట్టి సాధించుకునే తత్త్వం - మనకు గర్వకారణమైన వారిని గౌరవించుకునే సమయం వచ్చినప్పుడు ఎందుకు ఉండదు ? పక్కనే ఉన్న తమిళ రాష్ట్రం ని చూసి ఎందుకు నేర్చుకోం ? గాయని పి. లీలని మన అనీ, చనిపోయిన వెంటనే పద్మశ్రీ వచ్చిందనీ చెప్పుకుంటున్నామే ... అది ఎవరి వలన ? తమిళుల రిప్రజంటేషన్ వలన ..! మన ఎస్పీ బాలు కి పద్మభూషణ్ వచ్చింది ఎవరి వలన ? తమిళుల రిప్రజంటేషన్ వలన ...!
కానీ మనం !? శ్రీరామచంద్ర ఇండియన్ ఇడల్ కి ఎంపిక కావాలని ఎస్సెమ్మెస్ ల మీద ఎస్సెమ్మెస్ లు పంపిస్తాం. అవినీతి మీద అన్నా హాజారే పిలుపుకి స్పందిస్తాం . బాపు గారి దగ్గిరకొచ్చేసరికి అభిమానులందరం ఎందుకు తగిన విధంగా రియాక్ట్ కాలేక పోతున్నాం ?మహా ఐతే పత్రికల్లో ఓ రెండు రోజుల పాటు కార్టూన్లు వేసేసి కసి తీర్చేసుకుంటాం. వీలయితే సంపాదకీయాలు రాసేస్తాం. ఎవరైనా ఎందుకు రాయలేదంటే - ఇదేమైనా నేషనల్ ప్రోబ్లెమా - అని కొట్టి పడేస్తాం . ఆరోజుకు వెతుక్కోకుండా స్లాట్ నిండుతుందంటే ఓ ఇద్దరు ముగ్గుర్ని పిలిచి టీవీల్లో చర్చా కార్య క్రమాలు నిర్వహించేస్తాం. ఇలా బ్లాగుల్లోనూ, ఫేస్ బుక్కుల్లోనూ షేర్ చేసేసుకుని 'హమ్మయ్య మన డ్యూటీ మనం చేసేశాం' అని చేతులు దులిపేసుకుంటాం.
మేం ఇంతే బాపు గారూ ... మీ నుంచి మేం బోలెడంత తృప్తినీ , ఆత్మానందాన్నీ పొందుతాం ... మిమ్మల్ని తెగ పొగుడుతాం ... మిమ్మల్ని గౌరవించుకునే సమయం వచ్చేసరికి మా మా లెవెల్స్ లో భలేగా తప్పుకుంటాం ... మీకు తెలియనిదేముంది బాపూ గారూ ... మేం ఇంతే ... మీకు చేతనైతే దయచేసి మమ్మల్ని క్షమించకండి ...
బాపు గారికి పద్మ అవార్డు రాకపోవటానికి అసలు కారణం ఏమై వుంటుంది ? శాంతా బయోటెక్ వర ప్రసాద రెడ్డి గారన్నట్టు 'భూపేన్ హజారికా గురించి మనకి తెలుసు. భీమ్ సేన్ జోషి గురించి తెలుసు. అలా మన బాపు గారి గురించి నార్త్ లో తెలియక పోవడానికి కారణం అక్కడి మీడియా . అక్కడ వాళ్ళ గురించి ఇక్కడ మనం ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ పరిశోధించి మరీ రాస్తాం. మనవాళ్ళ గురించి వాళ్ళు రాయరు . మనం పబ్లిసిటీ చేసుకోం. బాపు గారి గురించి చెబితే - సౌత్ లో కార్టూనిస్ట్ లు కూడా ఉన్నారా ? - అని ఆర్కే లక్ష్మణ్ అన్నారట. దీనికి కారణం కొంత వరకూ మీడియానే. '
నిజమే ... కొంత మీడియా అయితే.. మరికొంత రాజకీయ నాయకులు... తమకు కావలసిన సీట్లను, పదవులను పట్టు పట్టి సాధించుకునే తత్త్వం - మనకు గర్వకారణమైన వారిని గౌరవించుకునే సమయం వచ్చినప్పుడు ఎందుకు ఉండదు ? పక్కనే ఉన్న తమిళ రాష్ట్రం ని చూసి ఎందుకు నేర్చుకోం ? గాయని పి. లీలని మన అనీ, చనిపోయిన వెంటనే పద్మశ్రీ వచ్చిందనీ చెప్పుకుంటున్నామే ... అది ఎవరి వలన ? తమిళుల రిప్రజంటేషన్ వలన ..! మన ఎస్పీ బాలు కి పద్మభూషణ్ వచ్చింది ఎవరి వలన ? తమిళుల రిప్రజంటేషన్ వలన ...!
కానీ మనం !? శ్రీరామచంద్ర ఇండియన్ ఇడల్ కి ఎంపిక కావాలని ఎస్సెమ్మెస్ ల మీద ఎస్సెమ్మెస్ లు పంపిస్తాం. అవినీతి మీద అన్నా హాజారే పిలుపుకి స్పందిస్తాం . బాపు గారి దగ్గిరకొచ్చేసరికి అభిమానులందరం ఎందుకు తగిన విధంగా రియాక్ట్ కాలేక పోతున్నాం ?మహా ఐతే పత్రికల్లో ఓ రెండు రోజుల పాటు కార్టూన్లు వేసేసి కసి తీర్చేసుకుంటాం. వీలయితే సంపాదకీయాలు రాసేస్తాం. ఎవరైనా ఎందుకు రాయలేదంటే - ఇదేమైనా నేషనల్ ప్రోబ్లెమా - అని కొట్టి పడేస్తాం . ఆరోజుకు వెతుక్కోకుండా స్లాట్ నిండుతుందంటే ఓ ఇద్దరు ముగ్గుర్ని పిలిచి టీవీల్లో చర్చా కార్య క్రమాలు నిర్వహించేస్తాం. ఇలా బ్లాగుల్లోనూ, ఫేస్ బుక్కుల్లోనూ షేర్ చేసేసుకుని 'హమ్మయ్య మన డ్యూటీ మనం చేసేశాం' అని చేతులు దులిపేసుకుంటాం.
మేం ఇంతే బాపు గారూ ... మీ నుంచి మేం బోలెడంత తృప్తినీ , ఆత్మానందాన్నీ పొందుతాం ... మిమ్మల్ని తెగ పొగుడుతాం ... మిమ్మల్ని గౌరవించుకునే సమయం వచ్చేసరికి మా మా లెవెల్స్ లో భలేగా తప్పుకుంటాం ... మీకు తెలియనిదేముంది బాపూ గారూ ... మేం ఇంతే ... మీకు చేతనైతే దయచేసి మమ్మల్ని క్షమించకండి ...
Monday, January 23, 2012
E mail of Bapu
జనవరి 25 న మా టీవీ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించబోతోంది. అందులోని భాగంగా బాపు గారిని ఆహ్వానించే బాధ్యత నాపై పడింది . టిక్కెట్లు రిజర్వు చేసాం అని చెప్పగానే "అయితే ఆ ఈ టికెట్స్ ని నా ఈ మెయిల్ కి పంపండి " అన్నారు బాపు గారు. " చెప్పండి" అన్నాను. " రాసుకోండి ... బాపు అండర్ స్కోర్ రమణ " అని చెబుతున్నారు బాపు గారు ... నా చెవులు ఏదో వింటున్నాయి చేతులు రాసేసుకుంటున్నాయి. మనసు మాత్రం పిండేసినట్టు అయిపోయింది. బాపు రమణల గురించి అందరికీ అన్నీ తెలుసు. గానీ రమణ గారి పేరుని బాపు గారు తన ఈ మెయిల్లో ఇముడ్చుకుంటారని ఊహించలేక పోయాను.
ఓ సారి బాపు గారి చెబుతూ " బాపు అసలు పేరు ఏమిటో తెలుసా ?" అని అడిగాను. " ఓస్ ... ఆమాత్రం తెలీదనుకున్నావా ... సత్తిరాజు లక్ష్మినారాయణ " అన్నారు మా ఫ్రెండ్స్. " మరదే ... అదెవరైనా చెప్తారు. ఆయన అసలు పేరు ... ముళ్ళపూడి వెంకట రమణ " అన్నాను. మంచి ప్రశంసలు లభించాయి ఆ చమత్కారానికి.
ఈ సందర్భం గా ఓ మాట చెప్పుకోవాలి. రెండేళ్ళ క్రితం వరకూ ... గత పదేళ్ళు గా బాపు రమణలకి పద్మశ్రీ ఇవ్వాలని రిప్రజంటేషన్ లు పెడుతూ వచ్చాను. విసుగొచ్చేసింది. ఇప్పుడు పద్మశ్రీ ఇచ్చినా అది తక్కువే . పైగా రమణ గారు లేకుండా ... ఈ విషయం లో మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంచి పనే చేసింది. రఘుపతి వెంకయ్య అవార్డుని ఇద్దరికీ కలిపి ఒకేసారి ఇచ్చింది. ఈ సంవత్సరం పంపిన రికమండేషన్ లలో బాపు గారి పేరు వుందట. రేపు రాబోయే 25 మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది అందరికీ. బాపు గారికి పద్మశ్రీ కాకుండా పద్మ భూషణ్ రావాలని కోరుకుందాం .
Sunday, January 22, 2012
Status of Lyric writers
' శ్రీరామరాజ్యం'లో పాటలు విన్నాక ఓ ఫ్రెండు అడిగాడు - 'సీతా రామ చరితం ' పాటలో 'దశరథుని కోడలికా ధర్మపరీక్ష ' అని ఎందుకు రాశారంటావ్- అని. చాలా మంచి ప్రశ్న అది . ఇక్ష్వాకుల వంశం లో అందరూ ధర్మానికి కట్టుబడినవారే. తను పుత్రశోకంతో మరణిస్తానని తెలుసు దశరథునికి. అది శ్రవణకుమారుని తలిదండ్రుల శాపం. రాముణ్ని అడవులకు పంపితే తన ప్రాణం పోతుందని తెలిసి మరీ ధర్మానికి కట్టుబడినది దశరథుడే. అంచేతే ఆ వాక్యం.
ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష
శ్రీరాముని భార్యకా శీలపరీక్ష
అయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష
దశరథుని కోడలికా ధర్మ పరీక్ష
జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రాణానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా
ఇలాటిదే మరో అద్భుత వాక్యం - 'జగదానంద కారకా' పాటలో .... !
రాజ మకుటమే వొసగెలే నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం
రాజ మకుటం గా పెట్టబోయే కిరీటం లోని నవరత్నాలన్నీతమ కాంతులతో నీరాజనం పడుతున్నాయట. అలాగే సూర్య వంశ సింహాసనం పులకించిపోయి తనే అభివందనం చేసిందట. ఏ రాజైనా సింహాసనానికి అభివందనం చేసి కూర్చుంటాడు. కానీ రాముడికి సూర్య వంశ సింహాసనం పులకించి పోయి తనే అభివందనం చేసిందట.
ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప ఎక్స్ ప్రెషన్లతో పాటలు రాశాడు జొన్నవిత్తుల 'శ్రీరామ రాజ్యం'లో.
ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే 'శ్రీరామ రాజ్యం' లో జొన్నవిత్తుల అన్ని పాటలూ రాశాడు. సింగిల్ కార్డ్ రైటర్. అయినా పబ్లిసిటీ లోగోలో ఆయన పేరు లేదు. అంతే కాదు వాల్ పోస్టర్స్ లో కూడా ఎక్కడా
ఆయన పేరు కనబడదు.
ఇదీ మన వాళ్ళు లిరిక్ రైటర్స్ కి ఇచ్చే గౌరవం. ఇదొక ఉదాహరణ మాత్రమే.
కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో ఆ సినిమాకి పాటలు రాసే గీత రచయితలు కనబడరు. కారణం వారికి ఆహ్వానం వుండదు. ఒకవేళ సదరు గీత రచయితలు వచ్చినా వారిని స్టేజ్ మీదకు పిలవరు. ఒకవేళ పిలిచినా వారి పని చప్పట్లు కొట్టడం, (కుదిర్తే) క్యాసెట్ కవర్లు పట్టుకుని ఫోటోల్లో కనబడడం ... అంతకు మించి మాట్లాడే చాన్స్ వుండదు. తెలుగు రాని హీరోయిన్లను మాట్లాడమని బలవంతం చేస్తారు కానీ రచయితలకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. అదీ సంగతి.
మళ్ళీ ఇందులో కొంతమంది ఎక్సెప్షన్. కృష్ణవంశీ సినిమా ఆడియో ఫంక్షన్స్ లో రైటర్స్ కి గౌరవం వుంటుంది. వై వీ యస్ చౌదరి దారే వేరు. సీడీ కవర్ మీద రైటర్ ఫోటో వేస్తాడు. వీలయితే రైటర్ కి ఓ బిరుదు కూడా ఇచ్చేస్తాడు. 'సీతయ్య' ఆడియో ఫంక్షన్ లో చంద్రబోస్ కి 'సాహిత్య చిచ్చర పిడుగు ' అనే బిరుదు ఇచ్చేసాడు. ఈ మధ్యనే జరిగిన 'నిప్పు' ఆడియో ఫంక్షన్ లో ఆ సినిమాకి 6 గురు పాటలు రాస్తే ఆ ఆరుగురినీ ( చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, వనమాలి, భాస్కరభట్ల, విశ్వ) స్టేజ్ మీదికి పిలిపించి మాట్లాడే అవకాశం ఇచ్చాడు. అంతే కాదు సీడీ కవర్ మీద ఆ ఆరుగురి ఫోటోలూ, వారి పేర్లూ వచ్చేట్టు చూశాడు. అది కాక ఫంక్షన్ లో ఆ ఆరుగురి ఫొటోలతో స్పెషల్ గా ఓ హోర్దింగే పెట్టాడు కూడా. 'కవి గాయక నట వైతాళిక ' అన్నారు పెద్దలు. అంటే ప్రాదాన్యతా క్రమం లో కవి ముందుండాలి. కవి, రచయిత వీళ్ళ విలువ తెలిసున్నది ఇవాళ కొంతమందికి మాత్రమే.
Subscribe to:
Posts (Atom)









