Friday, December 28, 2012

మణిరత్నం, రెహమాన్ ల ’కడలి’ ని ఈదిన వనమాలి



(’కడలి’ సినిమాలో ’గుంజుకున్నా’ పాటని రెహమాన్ శక్తిశ్రీ గోపాలన్ తోనే 
ఎందుకు పాడించాడు అనే నా అభిప్రాయానికి వచ్చిన స్పందన చూశాక
విడివిడిగా సమాధానం చెప్పడం బదులు అనువాద సాహిత్యానికి సంబంధిన 
కొన్ని విషయాలు పంచుకుంటే బాగుండుననిపించింది. అదేమిటంటే ....)

'కడలి' సినిమాలోని 'గుంజుకున్నా నిన్ను ఎదలోకే' పాట
తమిళ వెర్షన్ 'నెంజిక్కుళ్ళే ఒమ్మ ముడింజురుక్కేన్'
అనే పల్లవి తో మొదలవుతుంది.
'నెంజిక్కుళ్ళే' అంటే మనసుని లాక్కోవడం
'ఒమ్మ' అంటే నిన్ను
'ముడింజురుక్కేన్' అంటే ముడి వేసుకున్నాను
ఆల్రెడీ షూటింగ్ జరిపేసుకున్న ఈ పాటకి
సరిపడేట్టుగా  అనువాద గీతాన్ని రాయాలి .
రచయిత వనమాలి
'గుండెలోనె నిన్ను ముడివేశా'
అంటూ మొదలు పెట్టాడు.
ఇది ఫస్ట్ వెర్షన్
కానీ తమిళం లో వున్నట్టు గా 'నెంజ్' అనే సౌండ్ కి
దగ్గరగా వుండే మాట కావాలని అడిగారు మణిరత్నం.
లిప్ సింక్ కాకపోయినా ఫరవాలేదన్నారు.
కావాలంటే గమనించండి ...
'ముడింజురుక్కేన్' దగ్గర వేసిన
'ఎదలోకే '  అనే మాటకి లిప్ సింక్ కాదు.
అయినా 'ఓకే ' అన్నారు
'గుంజుకున్నా' అనే మాటలో ఒక చనువుంటుంది అన్నారు
ఎందుకంటే కథలో హీరో ఓ జాలరి.
చదువు రాని అనాగరిక ప్రపంచంలో పెరిగిన వాడు.
మొరటుగా ప్రవర్తించే వాడు.
 నెగిటివ్ షేడ్స్ కొంచెం ఎక్కువున్న వాడు.
అతనితో చనువు గా హీరోయిన్ ఏదైనా అనాలంటే
అతని లక్షణాలకి తగ్గ మాట పడాలి
(జాలరి వలని గుంజుకుంటాడు గా)
సాధారణంగా రెహమాన్ గానీ, మణిరత్నం గానీ
పాటల సాహిత్యం లో శబ్ద సౌందర్యానికి ప్రాదాన్యం ఇస్తారు.
రెహమాన్ తన 'రోబో' తమిళ వెర్షన్ 'ఎన్ దిరన్' (యంత్రం) లో
'అరిమా అరిమా' అన్నాడు.
'అరిమ' అంటే తమిళంలో సింహం.
దాన్ని తెలుగు చెయ్యాల్సి వచ్చినప్పుడు
'హరి' అంటే సింహం అనే అర్ధం కూడా వుంది కాబట్టి
చివర్న 'మ' కార ప్రత్యయం చేర్చి 'హరిమా హరిమా' అని రాశాడు వనమాలి.
మణిరత్నం రెహమాన్ ల కాంబినేషన్ 'బొంబాయి' సినిమాలోని
'వుయ్ రే వుయ్ రే' పాటని తీసుకుంటే
'వుయ్ రే' అంటే 'ప్రాణమా' అని అర్ధం.
అక్కడ 'వు' తో మొదలయింది కనుక
సాహిత్య పరంగా రెహమాన్, మణిరత్నం ల శబ్ద రహస్యాలను,
అభిరుచిని పసిగట్టిన వ్యక్తి కనుక
'ఉరికే చిలకా' అంటూ
'ఉ' తో మొదలు పెట్టారు వేటూరి.
అలాగే రెహమాన్ తో చేసిన 'మిన్సార కణవు' (తెలుగు లో మెరుపు కలలు) లోని
'తల్లో తామర ముడిచే' పాట తమిళ వెర్షన్ రెండో లైన్ లో వున్న
'తత్తితావుదు మనమే' ని తెలుగు చేయాల్సి వచ్చినప్పుడు
'అట్టిట్టాయెను మనమే' అని రాశారు వేటూరి.
'తత్తిత్తావుదు' కి 'అట్టిట్టాయెను' అద్భుత మైన సౌండింగ్
ఇక - 'మనమే' ...
నిజానికి ఇలాంటివి పాత రోజుల్లో వాడేవారు.
(మనమీ నందన వనమౌ కాదా - మాయింటి మహాలక్ష్మి)
ప్రస్థుతం జనరేషన్ కోసం అయితే 'మనసే' అని రాయాలి
కానీ వేటూరి ఆటు శబ్ధం, ఇటు లిప్ సింక్ చూసుకున్నారు.
అందుకే 'మనమే' అని రాశారు.
అనువాద సాహిత్యం అందరూ అనుకుంటున్నంత సులువు కాదు.
మళ్ళీ 'కడలి' సినిమాకే వస్తే
ఇంకో పాటలో
'అడియే అడియే' అని ఒరిజినల్ లో వుంది
అంటే 'ఒసేయ్ ఒసేయ్' అని అర్ధం
'ఎన్నఎంగే నీ కూటి పోరా'
అనేది తర్వాతి లైన్
అంటే 'నన్ను ఎక్కడికి తీసుకెళ్తావ్' అని అర్ధం
దీని మీనింగ్ ని తీసుకుని
మన నేటివిటీ టచ్ వచ్చేలా
'అడియే అడియే' కి సరిపోయేలా
'యాడికే యాడికే' అని రాశాడు వనమాలి.
జాలరి మాట్లాడే పల్లెటూరి భాష అది
ఆ 'కడల్ '  సినిమాలోనే
'చిత్తిరై నిలా ఒరే నిలా' అనే మరో పాటుంది
అంటే 'చైత్ర మాసపు జాబిలీ' అని అర్ధం
ఈ పాటకి వనమాలి మొదట రాసినది
'నిండు జాబిలీ ఓ జాబిలీ' ...
మళ్ళీ సౌండింగ్ ఇంపార్టెంట్ అన్నారు
దాంతో 'చిట్టి జాబిలీ' అని రాశాడాయన.
పాట నోటికి ఇమ్మీడియట్ గా పట్టుబడాలంటే
శబ్ద సౌందర్యం అవసరం అని నమ్ముతారు
మణిరత్నం, రెహమాన్..
ఒరిజినల్ పాట లోని
మీనింగ్ పక్కదారి పట్టకుండా
భావం చెడకుండా
అందులోనే వుంటూ
శబ్ద సుగమంగా
బాణీకి న్యాయం చేస్తూ రాయాల్సిన బాధ్యత
స్ట్రెయిట్ సాంగ్స్ రాసే రచయిత కన్నా
అనువాద గీతాలు రాసే రచయితకి ఎక్కువ.
ఇవాళ పరిశ్రమలో ఓ గీత రచయిత బతకాలంటే
అతని మెదడు లో తెలుగుతో పాటు
తెలివీ తేటా సమయస్ఫూర్తి
రసమయ స్ఫూర్తి మనస్పూర్తిగా వుండాలి.
ఈ సందర్భంగా దాశరథి గారు
నాతో అన్న మాట గుర్తొస్తోంది
ఎడ్జెస్ట్ కాలేని వాడు ఎగ్జిస్ట్ కాలేడు .
అలాగే ఆత్రేయ ’ప్రేమ నగర్’ లో రాసినట్టు
ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే
మంచి చేసే అవకాశాల్ని శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది.
ఇది నేను రాయ(లే)ను అని వెళ్ళిపోవడం సులువు
కానీ గొప్ప గొప్ప వారిని మెప్పిస్తూ
వారికి కావలసినది అందిస్తూ
ఉనికిని, మనికిని కాపాడుకోవటం చాలా కష్టం.
పైగా వేటూరి స్వంత కోట లాంటి
మణిరత్నం, రెహమాన్ క్యాంప్ లో
ప్రవేశించడానికి,  ప్రవేశించి
అంతటి ప్రతిభావంతుల్ని మెప్పించడం
మాటలు కాదు కదా ?
బైట వుండి మనం చాలా అనుకుంటాం.
అది సహజం కూడా.
కానీ తెర వెనుక విషయాలు కూడా తెలిస్తే
అభిప్రాయాల్లో మార్పుంటుందేమోననే
ఈ ప్రయత్నం.

Thursday, December 27, 2012

రెహమాన్ శక్తిశ్రీ తోనే ఎందుకు పాడించాలి ?



మణిరత్నమ్, ఏ.ఆర్. రెహమాన్ ల 'కడలి' సినిమా ఆడియో రిలీజ్ అయ్యింది.
ఇది తమిళం లోని కడల్ కి తెలుగు వెర్షన్.
'కడల్ ' కోసం చేసిన 'నెంజిక్కుళ్ళై' పాటని
ఎమ్ టీవీలో 'రెహమాన్ అన్ ప్లగ్గ్ డ్ ' ప్రోగ్రామ్ ద్వారా
ప్రేక్షక శ్రోతలకు రెహమాన్ కొన్ని నెలల క్రితమే పరిచయం చేశాడు.
అప్పట్నించీ ఈ ట్యూన్ కి విపరీతమైన ఆదరణ.
ఒకానొక దశలో 'కోలావెరి' హిట్స్ ని దాటిపోయిందేమోనన్న
అభిప్రాయం కూడా స్ప్రెడ్ అయ్యింది.
ఆ ట్యూన్ తెలుగు వెర్షన్ లో 'గుంజుకున్నా' అనే పాటగా
'కడలి' ఆడియోలో వుంది. తమిళం లోనూ, అన్ ప్లగ్గ్ డ్ ప్రోగ్రామ్ లోనూ
పాడిన శక్తిశ్రీ గోపాలనే తెలుగు వెర్షన్ (గింజుకున్నాపాట) ని పాడింది.
ఈ తెలుగు వెర్షన్ ని విన్న ఓ సంగీతాభిమాని అంజనా సౌమ్య గాని
శ్రావణ భార్గవి గాని పాడి వుంటే బాగుండేది అని ఓ అభిప్రాయాన్నినాకు పంపారు.
దానికి నా సమాధానం ఇదీ :
(ఆ తెలుగు పాటని విని నా అభిప్రాయం మీద మీ అభిప్రాయం చెప్పండి)
'నెంజిక్కుళ్ళె' తెలుగు వెర్షన్ 'గుంజుకున్నా' పాట మీద మీ అభిప్రాయం చదివాను.
ఏవైనా రెండు ఒక్క లాంటివే వస్తే ప్రేక్షకులు విధిగా మొదటి దాన్నే మెచ్చుకుంటారు.
ఇది కొన్ని తరాలుగా ఋజువవుతోంది.
అంజనా సౌమ్య , శ్రావణ భార్గవి పై మీకు గల అభిమానం 
సద్విమర్శకు అతీతంగా ఆలోచించేలా చేస్తోందనిపిస్తోంది . .
ఈ పాటకి గొంతులో కొంత నాసికా సౌందర్యం తో పాటు
మింగబోతున్న వెన్న ముద్దని కంఠం మధ్యలోనే ఆపి
ఆ మాధుర్యాన్ని పాటకు ఆసాంతం పూయగల సామర్ధ్యం వుండాలి.  
శక్తిశ్రీ గోపాలన్ లో ఆ క్వాలిటీని పట్టుకున్నాడు రెహమాన్.
ఒరిజినల్ పాటని వేరే భాషలోకి తీసుకున్నప్పుడు గాయనీ గాయకుల్ని
మార్చిన సందర్భాలు రెహమాన్ కి వున్నాయి. 
ఈ పాటకి మార్చక పోవడానికి ఆ క్వాలిటీయే కారణం అనుకుంటున్నాను.
రెహమాన్ కి అంజనా సౌమ్య వాయిస్, శ్రావణ భార్గవి వాయిస్ తెలుసు.
వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కరెక్ట్ అనుకున్నా రెహమాన్ ఒదిలి పెట్టడు.
మూల మూలల్నించి గాయనీ గాయకుల్ని వెతికి పట్టుకుని
శ్రోతలకి పరిచయం చేసిన చరిత్ర రెహమాన్ ది.
అంజనా సౌమ్య లో గొంతులో వున్న నాసికా సౌందర్యం ఈ పాటకి
సరిపోతుందేమో గానీ పైన చెప్పిన రెండో క్వాలిటీ లేదు.
ఇక శ్రావణ భార్గవి తన గొంతుని రకరకాలు గా మార్చగలదేమో గానీ
తన ఒరిజినల్ గొంతుతో  ఇన్ని అందాలను పలికించ లేదు.
ఈ పాటకి ఏ భాషలోనైనా - రెహమాన్ ఊహించి పంచిన అనుభూతిని
అందించ గల గాయని శక్తిశ్రీ గోపాలన్ కి వుంది
రెహమాన్ పాటకు అంకితమైన వ్యక్తి.  
వ్యక్తిగత మైన అభిమానాలకు తావివ్వడు.
ఇచ్చే వ్యక్తే అయితే ఇంతమంది సింగర్లను పరిచయం చెయ్యడు.
ఈ పాటకు శక్తిశ్రీ తరువాత కొంతలో కొంత సరిపోయే గొంతు మధుశ్రీ ది.
( యువ లో సంకురాత్రి కోడి పాటను గుర్తు తెచ్చుకోండి)
ఇవన్నీ గాక పూర్తి తెలుగు తనాన్నే కోరుకుంటే
ఈ రకం అందాలన్నిటినీ మర్చిపోతే (గలిస్తే) ,
సరికొత్త అందాలతో పాడగల గాయని 
కేవలం శ్రేయా గోషల్ మాత్రమే.
ఇదీ నా అభిప్ర్రాయం.

Monday, December 24, 2012

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గురించి ...


    

ఇండస్ట్రీ లో ఇప్పుడు హాట్ టాపిక్  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.నిజానికి ఈ టైటిల్ కి ఆధారం పాత రోజుల్లో పిల్లల్ని ఆడిస్తూ పాడడానికి ఉపయోగించే బాల గేయ సాహిత్యం. దీనికి కర్తలెవరో తెలియకుండా తరతరాలు గా వస్తోంది. ఆ సాహిత్యాన్ని, ఆ నోటా ఆ నోటా  ఓ సంప్రదాయంగా వస్తున్న ట్యూన్ ని తీసుకుని స్వర్గీయ పాలగుమ్మి విశ్వనాథం గారు రేడియోలో పాడించారు.నెలవంక పేరు తో పుస్తకంగా, సీడీలుగా రిలీజ్ చేశారు.
ఆ పుస్తకంలోని ముందుమాటని, ఆనాటి ఆ గేయం సాహిత్యాన్ని సంగీతాభిమానుల కోసం జతపరుస్తున్నాను.
పాట లింక్ కూడా వుంది. క్లిక్ చేస్తే వినొచ్చు.

http://www.palagummiviswanadham.com/music/pillala-paatlau/nelavanka-cd1/seethammavakita.mp3