ఓ సారి వృత్తి రీత్యా ఓ ఇంటర్వ్యూ కోసం సంగేత దర్శకుడు కీరవాణి గారిని కలవడం జరిగింది.ఆయన కున్న టైట్ షెడ్యూల్ వల్ల కారులోనే ఇంటర్వ్యూ చేయక తప్పలేదు. ఇంటర్వ్యూ అయ్యాక, జర్నీ ఇంకా వుండడం చేత ఆయన తన దగ్గరున్న ల్యాప్ ట్యాప్ ని ఆన్ చేశారు. అప్పుడు వినిపించింది ఓ తమిళ గీతం. వినడానికి ఎంత గొప్ప గా అనిపించిందో పాడడానికి అంత కష్టం గా వుంటుందంపించిందా పాట.ఇది సుమారు ఏడు సంవత్సరాల క్రితం సంగతి. అప్పట్నుంచి సుమారు ఓ రెండేళ్ళ పాటు సాగింది వేట - ఆ పాట వివరాలు కనుక్కోడానికి. మా టీవీ లో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ రీత్యా చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ కనబడ్డ ప్రతి వీడియో షాపులోనూ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒక షాపులో మాత్రం నా అవస్థ గమనించి ఆ పాటని ముత్తైతరు పాట అని అంటారని , అది అరుణగిరి నాదర్ 'సినిమాలోనిదని, ఆ వీడియో కాపీ తన దగ్గర ఒక్కటి మాత్రమే వుందని,దాని ఖరీదు రెండు వందల డబ్భై అయిదు అయినా హైద్రాబాద్ నుంచి వచ్చాను కనుక నూటా యాభై కి ఇస్తానని అన్నాడు. (మూసార్ బేర్ కంపెనీ రాకముందు వీసీడీల ధరలు అలాగే వుండేవి). అదికూడా మర్నాడు పదిన్నరకి వస్తేనే ఇస్తానన్నాడు. మర్నాడు సరిగ్గా అదే సమయానికి మణిశర్మతో ఇంటర్వ్యూ షూటింగ్.షెడ్యూల్ ప్రకారం ఆయన ఇంటికి వెళ్తే తెమలడానికి మరో అరంగంట కావాలన్నారు లక్కీగా.ఆ అరగంట నాకోసమే అన్నట్టుగా సెట్ అయింది. వెంటనే వెళ్ళి అ వీడియోని చేజిక్కించుకున్నాను. తిరిగి వచ్చాక చేతిలో ఉన్న వీడియోని చూసి, జరిగిన కథని మొత్తం విన్నాడు మణిశర్మ." ఆ ముత్తైతరు పాటని ప్రాక్టీస్ చెయ్యడాని చచ్చేవాళ్ళమండీ బాబూ ...."అంటూ ఆ పాటలో ఎక్కడెక్కడ కష్టం గా వుంటుందో వాటన్నిటినీ పాడి వినిపించాడాయన." ఇంత కష్టమైన సాహిత్యాన్ని తెలుగులో ఇప్పుడెవరైనా రాయగలరా ? " అని అడిగాను. దానికాయన " వేటూరి గారు ఒక్కరే రాయగలరు . ఐనా సంగీతం మీద ఇలాంటి ప్రయోగాలు ఇవాళ ఎవరు చెయ్యనిస్తారు ?" అన్నారు. విన్నాక మీకూ అనిపిస్తుంది ఇలాంటివి పాడడం ఎంత కష్టమో... అన్నట్టు ఈ పాటను పాడిందీ, పాటకు నటించిందీ తమిళ నాట అలనాటి ప్రముఖ గాయకుడు టి.యం.సౌందర్రాజన్.
Monday, August 17, 2009
Wednesday, August 5, 2009
ప్రే 'రణ ' రంగం లో సృజనాత్మకత

ఈ ఫొటోలో వున్నావిడ పేరు లీలానాయుడు. ఈ మధ్యనే చనిపోయింది. ఆ రోజుల్లో మంచి అందగత్తె గా ఈవిడ గురించి చెప్పుకునేవారు. ఈవిడ నటించిన సినిమాల్లో అందరికీ తెలిసిన సినిమా - ' ఏ రాస్తే హై ప్యార్ కి ' . అందులో రఫీ , ఆశా పాడిన ' ఎ ఖామోషియా ఎ తన్ హాయియా ' పాట చాలా పెద్ద హిట్. ఈ పాట ట్యూన్ ని కూడా మనవాళ్ళు వదలలేదు. 'మనుషులు - మమతలు ' సినిమాలో 'నిన్ను చూడనీ నన్ను పాడనీ ' పాటకి వాడుకున్నారు. కాకపోతే అప్పట్లో ఇటువంటి విషయాల్లో కొంత నిజాయితీ కూడా చూపే వారు. పల్లవినో, చరణాన్నో ప్రేరణగా తీసుకున్నా మిగతా భాగాన్ని అధ్భుతంగా స్వంతం గా చేసి, ప్రేరణగా తీసుకున్న భాగం తో కలిపి టోటల్ గా వచ్చిన అవుట్ పుట్టే ఒరిజినల్ అవుట్ పుట్టేమో అన్నంత బాగా పాటని తయారు చేసే వారు. అందుకు వుదాహరణ గా ' ఎ ఖామోషియా ' , 'నిన్ను చూడనీ ' పాటల్నే చెప్పుకోవాలి. రెండు పాటల్నీ మొత్తం గుర్తుకు తెచ్చుకునో లేదా డవున్ లోడ్ చేసుకుని వినో చూడండి. ప్రస్తుతానికి పల్లవులని మాత్రం క్లిక్ చెసి చూడండి.
Monday, July 13, 2009
' ఐయామ్ వెరీ సారీ ' పాట గురించి ...
ఇదివరకు ఏదైనా ఒక పాటని ఇన్ స్పిరేషన్ గా తీసుకుంటే ఆ ఒరిజినల్ సాంగ్ తెలియడానికి సంవత్సరాలు పట్టేది. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఇవాళ అందరికీ అన్నీ త్వరగానే తెలిసిపోతున్నాయి. అదీ కాక నేటి యువత కూడా మ్యూజిక్ పట్ల అప్ దేట్ గానే ఉంటున్నారు. ఒక అడాప్టేషన్ వినగానే ఒరిజినల్ ని క్షణాల మీద చెప్పేస్తున్నారు. ఐనా సరే కొన్ని రికార్డ్ కోసమైనా చెప్పక తప్పదు. పాప్ గాయని షకీరా పాడిన ' వేరెవర్ వెనెవర్ ' సాంగ్ చాల పాపులర్. దాన్ని ' నువ్వే నువ్వే ' సినిమాలో 'ఐయామ్ వెరీ సారీ ' పాట కోసం చాలా బాగా అడాప్ట్ చేశారు. ఎంత బాగా అడాప్ట్ చేశారో జతపరిచిన క్లిప్పింగ్స్ చూసి తెలుసుకోండి.
Saturday, July 11, 2009
' రావె రాధా రాణీ రావే ' పాట గురించి ...
పంతొమ్మిది వందల అరవై లో వచ్చిన 'శాంతి నివాసం ' సినిమాలో నాలుగు పాటలకి ట్యూన్ లు వేరే భాష నుండి తీసుకున్నారని ఇదివరకు చెప్పుకున్నాం . అందుకు ఉదాహరణ గా ' చక్కని దానా చిక్కని దానా ' పాట గురించి కూడా చెప్పుకున్నాం . అలాగే ఆ సినిమాలోని ఇంకో పాట ' రావే రాధా రాణీ రావే ' గురించి ఇప్పుడు ... ఈ పాటకి ఇప్పటికీ తిరుగులేదు. అంత హిట్ అయిందీ పాట . ఐతే అంతకు ఓ సంవత్సరం ముందు అంటే యాభై తొమ్మిది లో ' ఉజాలా' అనే సినిమా వచ్చింది . షమ్మీ కపూర్ , మాలాసిన్హా హీరో హీరోయిన్ లు . ఆ సినిమాలో సంగీత దర్శకులు శంకర్ - జైకిషన్ స్వరపరిచిన ' జూమ్ త మౌసమ్ మస్త్ మహీనా ' పాట చాలా పెద్ద హిట్ . అంతే కాదు ఆ పాత - గాయకుడు మన్నాడే కి ఓ వెరైటీ కూడా . ఆ పాట ట్యూన్ ని ఇంటర్లూడ్స్ తో సహా యధాతధం గా అనుకరించారు - ' రావే రాధా రాణీ రావే ' పాట కి. అందుకే ఆ హిందీ పాటనీ , మన తెలుగు పాట నీ కలిపి మరీ జత చేశాం. చూసి ఆనందించండి .
Friday, July 10, 2009
' ఖుషీ ఖుషీ గా నవ్వుతూ ' పాట గురించి ...
అన్నపూర్ణా వారి 'ఇద్దరు మిత్రులు ' లో 'ఖుషీ ఖుషీ గా నవ్వుతూ ' పాట అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ పాట ట్యూన్ ని ' టామ్ డూలీ ' ఆల్బమ్ నుండి తీసుకున్నారు. ఐతే పల్లవి వరకు మాత్రమే తీసుకున్నారు. చరణాలన్నీ మన ట్యూన్ లే . ఫల్లవి వరకు ఉన్న రెండు ట్యూన్ లనీ కంపేర్ చేసుకుని చూడండి.
Tuesday, July 7, 2009
' వస్తా నీ వెనక ' పాట వెనక లింకులు
మహేష్ బాబు నటించిన ' నానీ ' లో 'వస్తా నీ వెనక ' పాట రెహమాన్ హిట్స్ లో ఒకటి. ఐతే ఈ పాట తమిళ వెర్షన్ కి మాత్రం ఓ తమాషా చేశారు. అంతకు కొన్నేళ్ళ క్రితం ఎంజీయార్, బి.సరోజా దేవి నటించిన 'పడగోట్టి ' అనే చిత్రం విడుదలైంది. అందులోని ' తొట్టాల్ పూమలరుం ' పాట ఆ రోజుల్లోనే కాదు నేటికీ తమిళ నాట పెద్ద హిట్ . ఆ పాట పల్లవిని తీసుకున్నారు. ఆ పల్లవి ఎలా వుంటుందంటే - తొట్టాల్ పూమలరుమ్ - తొడామల్ నాన్ మలర్దేన్ - సుట్టాల్ పొణ్ణ్ శివక్కుమ్ - సుడామల్ కణ్ శివన్ దేన్ - కంగల్ పడామల్ - కైగల్ తొడామల్ - కాదల్ వరువదిల్లై - నేరిల్ వరామల్ - నెంజిల్ తరామల్ - ఆశై విడువదిల్లై ' . బాగా గమనించి వినండి. 'నానీ ' తమిళ వెర్షన్ (సినిమా పేరు న్యూ ) పాటకి , ' పడగోట్టి ' లోని హిట్ సాంగ్ కి పల్లవి వరకూ సాహిత్యం ఒకటే. కానీ ఈ తమాషాల పర్వం ఇక్కడితో ఆగలేదు. 'ఫడగోట్టి ' లోని ' తొట్టాల్ పూమలరుం ' ట్యూన్ ని మనవాళ్ళు 'హాయ్ ' సినిమా లోని 'తంతే పడిపోయా 'అఏ పాట కోసం తీసుకున్నారు. జతపరిచిన క్లిప్పింగ్ లని చూడండోసారి మీకే అర్ధమైపోతుంది.
Monday, July 6, 2009
' శాంతినివాసం ' లో ' చక్కనిదానా చిక్కనిదానా ' పాట గురించి ...
శాంతినివాసం ' సినిమా పంథొమ్మిది వందల అరవై లో వచ్చింది . అందులోని పాటలలో ఓ నాలుగింటికి మాతృకలు వేరే భాషలో ఉన్నాయి . ఒకపాటకైతే రెండు మాతృకలున్నాయి. పిఠాపురం నాగేశ్వర రావు , స్వర్ణలత పాడగా రేలంగి, సురభి బాలసరస్వతి పై చిత్రీకరించిన ' చక్కనిదానా చిక్కనిదానా ఇంకా అలుకేనా ' అనే పాటకు సరైన ఒరిగినల్ గా - ' దిల్ దెకే దేఖో ' చిత్రం కోసం ఉషాఖన్నా స్వరపరచగా షమ్మీకపూర్ పై చిత్రీకరించిన ' దిల్ దేకే దేఖో ' టైటిల్ సాంగ్ ని చెప్పుకోవాలి. ఇది పంథొమ్మిది వందల యాభై తొమ్మిది లో వచ్చింది. ఐతే దీనికి ఇన్ స్పిరేషన్ గా ఓ పాటుంది. పంథొమ్మిది వందల యాభై ఎనిమిది లో మాక్ గ్వయిర్ సిస్టర్స్ (వీరు ముగ్గురు) పాడగా - విడుదలైన కొద్ది రోజుల్లోనే వన్ మిలియన్ రికార్డులు అమ్ముడు పోయిన ' షుగర్ ఇన్ ద మార్నింగ్, షుగర్ ఇన్ ద ఈవినింగ్ ' అనే 'షుగర్ టైమ్స్ ' పాట శ్రీమతి ఉషాఖన్నా కు ఇన్ స్పిరేషన్ . ఆ పాట పల్లవిని మాత్రం తీసుకొని, స్పీడు పెంచి, చరణాలకు ఇంటర్లూడ్ లకు సెపరేట్ ట్యూన్ ని 'దిల్ దేకే దేఖో 'పాటకు చేసిందామె. ఆ ట్యూన్ నే యధాతధం గా మనం 'శాంతినివాసం' లోని 'చక్కనిదానా ' పాటకి వాడేసుకున్నాం .
Sunday, July 5, 2009
ధరణికి గిరి భారమా పాట గురించి ...
చాలా కాలం క్రితం ' మంచి మనసుకు మంచి రోజులు ' అనే సినిమా వచ్చింది. అలా అనే కంటే ' ధరణికి గిరి భారమా ' అనే పాట ఉన్న సినిమా వచ్చింది అంటే ఎవరికైనా సరే వెంటనే అర్ధం అవుతుంది - అంత హిట్ అయింది ఆ పాట . ఆ ' మంచి మనసుకు మంచి రోజులు ' సినిమాకి సంగీతం ఘంటసాల . ఐతే ఈ పాట పల్లవి కి మాత్రం ట్యూన్ ని కె.వి. మహదేవన్ స్వరపరిచిన ఓ తమిళ పాట నుంచి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే - తమిళం లో అంతకుముందు వచ్చిన ' తై పిరందాల్ వై పిరక్కుమ్ ' ఆధారంగా ' మంచి మనసుకు మంచి రోజులు ' సినిమాని తీశారు . ఆ ' తై పిరందాల్ ' లోని ' మణ్ణ్ క్క్ పరమ్ భారమా ' పాట ని పాడుకోని తల్లి ఆ రోజుల్లో తమిళ నాట లేదనే చెప్పాలి. అంచేత ఆ పాట ట్యూన్ ని పల్లవి వరకు నిర్మాతల కోరిక మేరకు అడాప్ట్ చెయ్యక తప్పలేదు ఘంటసాల గారికి. ఇక్కడ ఇంకో కొస మెరుపు ఏమిటంటే తెలుగు పాట ' ధరణి కి గిరి భారమా ' లో తల్లిగా నటించింది - ఒకనాటి హీరోయిన్ జయచిత్ర తల్లి అమ్మాజీ . ఈమె రోజులు మారాయి లో అక్కినేని కి చెల్లెలు గానూ , దైవబలం లో ఎన్టీయార్ కి హీరోయిన్ గానూ నటించింది.
Thursday, July 2, 2009
' వయస్సునామి ' పాట వెనుక రేగిన సునామి
' కంత్రీ ' సినిమాలో 'వయస్సునామి ' అనే పాటొకటుంది. ఈ పాటకి ట్యూన్ ని మణిశర్మ తమిళం నుంచి తీసుకున్నాడు. అంటే కాపీ కొట్టాడని కాదు. తెలుగులో హిట్టయిన ' పోకిరి ' సినిమాని తమిళంలో ' పోక్కిరి 'గా తీసినప్పుడు ఆ సినిమాకి సంగీత దర్శకుడి గా మన మణిశర్మని పెట్టుకున్నారు. అందులో ఆయన స్వరపరిచిన 'వసంతముళ్ళై ' అనే పాట తమిళనాట విపరీతంగా హిట్టయింది. ఆ పాట ట్యూన్ నే 'వయస్సునామి ' పాటకి వాడుకున్నాడు మణిశర్మ ... అంటే తన ట్యూన్ నే తను ఉపయోగించుకున్నాడన్నమాట . ఇదిలా ఉండగా దీనికి చేరిన మరో పిట్ట కథ ఏమిటంటే - యాభై ఏడులో శివాజీ గణేశన్ నటించిన 'సారంగధర ' విడుదలైంది. అందులో 'వసంతముళ్ళై ' అనే పల్లవితో మొదలయ్యే పాటొకటుంది.ఆ పాట ట్యూన్ ని ' పోక్కిరి ' లోని 'వసంతముళ్ళై ' పాట మధ్యలో మైక్ నుంచి వచ్చేట్టు సరదాగా ప్లాన్ చేసి పాడించుకొని చిత్రీకరించారు.ఈ సంగతి తెలియని కొందరు 'కంత్రీ ' లోని 'వయస్సునామి ' పాటకి ట్యూన్ ని పాత తమిళ చిత్రం నుండి మణిశర్మ కొట్టేశాడు అనే వార్తని ప్రచారం చేశారు. సో అదీ సంగతి. నిజానిజాలు తెలుసుకోడానికి ఆ క్లిప్పింగ్లు దిగువనే ఉన్నాయి. క్లిక్ చేసి చూడండోసారి.
Tuesday, June 23, 2009
అక్కినేని చేతి వేళ్ళకి డూపు

ఈ ఫొటొ లో వున్నాయన - ప్రముఖ సంగీత దర్శకుడు యస్. రాజేశ్వర రావు గారి పెద్దబ్బాయి రామలింగేశ్వర రావు. అందరూ సాలూరి బాబు అని అంటారు. ఈయన చేతి వేళ్ళు , అక్కినేని నాగెశ్వర రావు గారి చేతి వేళ్ళు ఒకేలా వుంటాయి. అంచేత ' చదువుకున్న అమ్మాయిలు ' సినిమాలో ' ఆడవాళ్ళ కోపంలో అందమున్నది ' అనే పాటలో అక్కినేని పియానో వాయించే క్లోజ్ షాట్లకి ఈయన చేతి వేళ్ళు డూప్ గా వాడేరు. ఆంతే కాదు ఆ సినిమాలో అక్కినేని పెట్టుకునే నల్లటి బెల్ట్ రిస్ట్ వాచ్ ని ఈ రామలింగేశ్వర రావు గారి చేతికి పెట్టి మరీ షాట్ తీశారు. దిగువనున్న వీడియో ని క్లిక్ చేసి చూడండోసారి .
Subscribe to:
Posts (Atom)