Sunday, March 25, 2012
National award for Vidya Balan again విద్యాబాలన్ కి మరోసారి జాతీయ అవార్డు
విద్యాబాలన్ కి 2012 సంవత్సరానికి జాతీయ స్థాయి లో ఉత్తమ నటిగా అవార్డు వస్తే ఈసారి ప్రతివారూ మెచ్చుకుంటారు - రాకపోతేనే బాధ పడతారు - అంత బాగా చేసింది 'కహానీ' లో... విద్యాబాలన్ అవార్డు తో పాటు మరో మూడు అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను - బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్, బెస్ట్ స్క్రీన్ ప్లే , బెస్ట్ డైరెక్షన్. అన్నివిధాలా ఎంతో బాగుందీ సినిమా. అనవసరపు డ్యూయెట్లు లేవు.. ఐటం సాంగ్ ఒక్కటీ లేదు. సినిమా బిగినింగ్ నుంచీ ఎండింగ్ వరకూ ఏ డీవియేషన్లూ లేకుండా ఒకటే పాయింట్ మీద వెళ్తుంది. చూస్తుంటే ఎంత తృప్తి గా వుందో !? చూస్తున్నంత సేపూ మన సౌందర్య లేకుండా పోయిందే అని ఎన్ని సార్లు అనిపించిందో !? ఉంటే కచ్చితంగా తెలుగులో ఈ సినిమా ప్లాన్ చేసే వాళ్ళమేమో ... మళ్ళీ అంతలోనే అనిపించింది - గగనం ని ఆదరించామా , రామరాజ్యాన్ని ఆదరించామా ... ప్రస్తుతం మనకే అర్హత వుందని ఇలాంటి సినిమాని తెలుగుకి ఊహించడానికి !? వద్దు లెండి ... మనందరిలోనూ మార్పు వస్తే తప్ప మన సినిమాల ధోరణి మారదు.
As a jury member for Nandi Awards నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా ...
ఉగాది రోజున నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా నందిని అందుకున్నాను. 2010 సంవత్సరం లో రిలీజైన సినిమాలకి సంబంధించి న్యాయ నిర్ణయం చేసినందుకు లభించిన మెమెంటో ఇది. నిజం చెప్పాలంటే అంతకు ముందు సంవత్సరాల జడ్జ్ మెంట్ కొన్నిచోట్ల విమర్శలకు గురైంది. 2010 జడ్జ్ మెంట్ కి మంచి పేరే తెచ్చుకున్నాం. ఈ సందర్భం గా గతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే - 1976 నుంచి 1980 టైం లో నందీ అవార్డుల ఫంక్షన్స్ ని కవర్ చెయ్యడానికి జర్నలిస్ట్ గా వెళ్ళేవాడిని. ఆ తర్వాత వివిధ పత్రికలలో నా రచనలు చూసి నందీ అవార్డుల ఫంక్షన్లో స్టేజ్ మీద కామెంటరీ కి కొన్ని సంవత్సరాల పాటు నా చేత ఎఫ్ డీ సి వారు రాయించేవారు.
ఓ సారి నందీ అవార్డుల ఫంక్షన్ కి షావుకారు జానకి గారు యాంకర్. ఆవిడ చెప్పాల్సిందంతా నేను రాయాలి. నేను రాయాల్సింది రాసిచ్చేసి వెళ్ళిపోయాను. ఆవిడ అంతా చదివి, "ఇది రాసినవారిని పిలిపించండి.వారితో నేను మాట్లాడాలి" అన్నారు. ఆవిడ ఆర్డర్ వేస్తే తిరుగేముంది ? వెంటనే నాకు కబురు పెట్టారు. ప్రతీ వాక్యాన్ని ఆవిడ చదువుతూ, నేనెందుకలా రాసానో తెలుసుకుంటూ, రకరకాల మాడ్యులేషన్లలోపలుకుతూ ఉంటూ వుంటే - ఆమె ప్రతిభకీ, కమిట్మెంట్ పట్ల ఆమెకి గల ఆసక్తికీ మనసులోనే నమస్కరించుకున్నాను. అంతటితో ఆగలేదావిడ . ప్రోగ్రాం చివర్లో " మీరందరూ నా కామెంటరీకి మెచ్చుకుని ఈ దండ వేసారే ... ఇది నేను రాసుకున్నది కాదు. దీన్నిచదివానంతే ... రాసినవారు వేరే వున్నారు ... ఈ మాటలూ ఈ భావాలూ అన్నీ ఆయనవే .." అంటూ పబ్లిక్ గా ప్రేక్షకులకి నిజం చెప్పేసి నన్ను స్టేజ్ మీదికి పిలిచేసి తన మెడలో వున్న దండ నాకు వేసేవరకూ ఊరుకోలేదు. అదీ ఆవిడ వ్యక్తిత్వం .
మరోసారి ఇలాంటి అనుభవమే ఎల్బీ శ్రీరాం తో ... అది కూడా నందీ అవార్డులకే ... రచన నాది. యాంకరింగ్ ఆయనది. షూటింగ్ లలో వుండడం వల్ల క్షణం తీరికలేదాయనకి. ఫంక్షన్ కి ఓ అరగంట ముందు వచ్చి నేను రాసింది చదువుకోవడం మొదలు పెట్టాడు. " బొత్తిగా టైం లేకుండా పోయింది. ఎలా వస్తుందో ఏమిటో" అన్నాడు బెరుగ్గా . " మీరు రైటరు కాబట్టి మానేజ్ చెయ్యగలరు" అని చెప్పి కొన్ని మాడ్యులేషన్లు నేననుకున్నవి వివరించాను. స్టేజ్ మీద చెలరేగిపోయాడాయన.
చాలాసార్లు చప్పట్లు పడ్డాయి ఆయన యాంకరింగ్ కి . ప్రోగ్రాం పూర్తయ్యాక ఆనందంతో నన్ను కౌగలించుకున్నాడు ఎల్బీ శ్రీరాం. ఆ తర్వాత నేను బిజీగా ఉండడంవల్ల క్లిప్పింగ్స్ పర్యవేక్షణ వరకూ కొన్ని నందీ అవార్డుల ఫంక్షన్ లకి నేను నా వంతు సాయం చేసాను. మాటీవీ లో చేరాక దర్శకుడి గా నేను తీసిన 'గుర్తుకొస్తున్నాయి' కార్యక్రమానికి ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా టీవీ అవార్డుల్లో నందీ అవార్డు ని అందుకున్నాను. ఇదిగో ... ఇప్పుడు జ్యూరీ మెంబర్ గా ... అదీ సినిమా విభాగానికి .... ఇదీ ఆంద్ర ప్రదేశ్ నందీ అవార్డులతో నా ప్రస్థానం.
ఈ జ్యూరీ అవార్డ్ ని అందుకునే టైం లోనే 2009 కి తన అవార్డులని అందుకోడానికి వచ్చాడు ఎల్బీ శ్రీరాం. అప్పటి సంగతులు తల్చుకున్నాం. " ఆ రోజు ఒరిజినల్ గా ఎంతో భయంగా వుంది. మీ ధైర్యం చూస్తే మరింత భయం వేసింది " అన్నాడు నిర్మొహమాటం గా. "అయితేనేం ... మొత్తానికి చప్పట్లు పడ్డాయి గా" అన్నాను. మళ్ళీ మరోసారి కౌగలించుకున్నాడాయన మనస్పూర్తి గా .. ఎల్బీ తో స్నేహం కూడా అవార్దంత గొప్పదే !!
Friday, March 16, 2012
A Tribute to Music Director Bombya Ravi ఆయన సంగీతం - స్వర రాగ గంగా ప్రవాహం
గురుదత్ భార్య పాట పాడిన ఏయన్నార్ సినిమా ఏది ?
ఎస్పీ కోదండపాణి సంగీతంలో వచ్చిన సినిమాలో గీతాదత్ పాడిన పాట ఏది ?
ఏ మ్యూజిక్ క్విజ్ లోనైనా ఇలాంటి ప్రశ్నలడిగితే ఆన్సరిచ్చే వాళ్ళు దొరకడం కష్టం. వీటికి ఆన్సరుందా అంటే అక్కినేని నటించిన 'మంచి కుటుంబం' సినిమాకి సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి. ఆ సినిమాలో గీతాదత్ పాడిన 'డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ లల్ల' అనే పాటుంది - అని జవాబు చెప్పొచ్చు. అసలివి నిజమైన ప్రశ్నలేనా అని లోతులకెళితే మాత్రం కరెక్ట్ కాదని ఒప్పుకోవలసి వస్తుంది. జెమిని వాళ్ళు హిందీ లో తీసిన 'గృహస్తి' సినిమాలోదా పాట. ఆ పాటని ట్యూన్ చేసింది రవి. ఆ సినిమాని అటు తమిళం లో 'మోటార్ సుందరం పిళ్ళై' గా, తెలుగులో 'మంచి కుటుంబం' గా తీసినప్పుడు సందర్భానికి సూట్ అవుతుందని ఈ పాటని యధాతధం గా సీన్ తో సహా వాడుకున్నారు. అలా రవి పాట తెలుగు సినిమాలోకి డైరెక్ట్ గా వచ్చేసిందన్న మాట. కాకపోతే అంతకు ముందూ, ఆ తర్వాతా రవి చేసిన ట్యూన్లు తెలుగు సినిమాల్లోకి వచ్చేసిన సందర్భాలు చాలా వున్నాయి . నిన్ను చూడనీ నన్ను పాడనీ (మనుషులు - మమతలు) - (ఎ ఖామోషియా ఎ తన్ హాయియా - యే రాస్తే హై ప్యార్ కి), ఈ వేళ నాలో ఎందుకో ఆశలు (మూగనోము) - (తుమ్హారీ నజర్ క్యోం కఫా హోగయీ - దో కలియా), అన్నా అన్నా విన్నావా చిన్నీ కృష్ణుడు వచ్చాడు (ఇలవేల్పు) - చందామామా దూర్ కి (వచన్), అందచందాల ఓ తారకా (వరుడు కావాలి) -(ముస్కురాతీ హుయీ చాంద్ నీ - అల్బేలీ), నీలిమేఘ మాలవో నీలాల తారవో (మదన కామరాజు కథ) (చౌద్ వీ క చాంద్ హో - చౌద్ వీ కా చాంద్) ఇవిలా వుండగా ఒరిజినల్ సినిమాని పూర్తిగా హక్కులతో సహా కొనుక్కోవడం వల్ల ఆయా సినిమాల్లో రవి చేసిన ట్యూన్లు ( కొన్ని) తెలుగులో పాపులరైనవి వున్నాయి. అలా 'మా బాబు' లోని 'బాబూ నిద్దుర పోరా ' , 'చల్ చలో యని స్వారి చేసెను' పాటలకి 'చిరాగ్ కహా రోష్ని కహా' లోనూ, 'భలే తమ్ముడు' లోని 'ఎంతవారు గాని' , 'గోపాల బాల నిన్నే కోరి' , 'గుమ్మా గుమ్మా గుమ్మెత్తించే ముద్దుల గుమ్మా' పాటలకి 'చైనా టౌన్' లోనూ, 'భలే అబ్బాయిలు' లోని 'గులాబీలు పూసేవేళ' , 'ఎవరో నా మది లో' , 'ఏమౌనో ఈవేళలో' పాటలకి 'వక్త్' లోనూ 'మొనగాళ్ళకి మొనగాడు' లోని 'నేనున్నది నీలోనే' , 'వచ్చామే నీ కోసం' పాటలకి 'ఉస్తాదోం కె ఉస్తాద్' లోనూ వున్న ఒరిజినల్స్ ని చెప్పుకోవచ్చు. ఇదిలా వుండగా 'భక్త జయదేవ' లోని 'నీ మధు మురళీ గానలీల' పాటకి ('స్వర్ణ మంజరి' లోని 'ఝనన ఝనన ఝణ నాదమే నాట్యం' పాటక్కూడా) 'నర్సీ భగత్' లోని 'దర్శన్ దో ఘన్ శ్యామ్' పాటా, 'పెద రాయుడు' లోని 'కదిలే కాలమా' పాటకి 'హమ్ రాజ్' లోని 'యే నీలే గగన్ కి తలే' పాటా - ఇన్స్పిరేషన్ అని విశ్లేషించే వారు కూడా లేకపోలేదు. ఇవి కూడా రవి ట్యూన్లే. ('ఉస్తాదోం కె ఉస్తాద్' లో 'మైనే కహాతా ఆనా సన్ డే కో సన్ డే కో' పాటని మనవాళ్ళు 'గూఢచారి 116 ' లో 'మనసుతీరా నవ్వులె నవ్వులె నవ్వాలి' పాటకి వాడుకున్నరనే వాళ్ళున్నారు. కాకపోతే ఈ రెండిటికీ మూలం 'నెవర్ ఆన్ సన్ డే' అనే ట్యూనుంది కనుక రవికి పూర్తి క్రెడిట్ ఇవ్వడం న్యాయం కాదు.) ఇలా మన తెలుగు ప్రేక్షకులు 'ఇవి రవివి ' అని తెలిసో తెలియకో చాలా ట్యూన్ లు ఆయన చేసినవి ఎంజాయ్ చేసేసారు. ఇక రవి సంగీతాన్నిచ్చిన హిందీ సినిమాల్ని వాటిలోని పాటల్నీ ఉత్తరాది ప్రేక్షకులతో సమానం గా ఆదరించిన దక్షిణాది ప్రేక్షక శ్రోతలు కోకొల్లలు. సి యే టి క్యాట్ - క్యాట్ మానె బిల్లీ, హమ్ కో మోహోబ్బత్ కరేగా (దిల్లీ కా థగ్), చౌద్ వీ కా చాంద్ టైటిల్ సాంగ్, యే హవా యే హవా, ఆజా ఆజారే తుఝ్ కో మేరా ప్యార్ పుకారే, చలో ఇక్ బార్ ఫిర్ సే, ఆప్ ఆయే తో ఖయాలే (గుమ్ రాహ్ - తెలుగులో అభినందన), నీల్ గగన్ కి ఉడ్ తీ బాదల్ (ఖాన్ దాన్ - తెలుగులో కలసి వుంటే కలదు సుఖం ), జబ్ చలీ టండీ హవా (దో బదన్), న ఝట్ కో జుల్ఫ్ కె పానీ (షెహనాయి), తోరా మన్ దర్పన్ కేహలాయే , మేరె భయ్యా మేరె చందా , చూలేనేదో నాజుక్ హోటోం కో, యే జుల్ఫ్ అగర్ జుల్ఫే (కాజల్ - తెలుగులో మా ఇంటి దేవత ), షిశిసే పీ, యే పైమానే సే పీ ( ఫూల్ ఆర్ పత్తర్ - తెలుగులో నిండుమనసులు తుజ్ కో పుకారే మేరా ప్యార్, బాబుల్ కి దువాయే ( నీల్ కమల్ ), ఇవి కాక హమ్ రాజ్, వక్త్ లాంటి అల్ సాంగ్స్ హిట్ సినిమాలు ఎన్నో వున్నాయి రవికి. 1926 మార్చ్ 3 న ఢిల్లీ లో పుట్టిన రవికి తండ్రి పాడే భజనల నుంచే సంగీతం అబ్బింది. తనకు తాను గా హార్మోనియం వాయించడం నేర్చుకున్నాడు. కుటుంబాన్ని పోషించడం కోసం కొన్నాళ్ళు ఎలక్ట్రీషియన్ గా పని చేసాడు. సింగర్ గా సెటిలవుదామని 1950 లో బొంబాయికి వచ్చేసాడు. ఇల్లు లేదు వాకిలి లేదు రోడ్ల మీదే మకాం. అలా హేమంత్ కుమార్ దృష్టిలో పడ్డాడు. 'ఆనంద్ మఠ్ ' లో 'వందే మాతరం' పాటలో కోరస్ పాడడానికి తీసుకుపోయాడు హేమంత్. ఆ తర్వాత కథ అతని పాటల ద్వారా అందరికీ తెలిసిందే . అటు మహేంద్ర కపూర్ కి, ఇటు ఆశా భోంస్లే కి రవి పాటలే కొత్త లైఫ్ ఇచ్చాయని హిందీ సినీ సంగీత చరిత్ర తెలిసిన ప్రతివారూ ఒప్పుకుంటారు. ఆల్మోస్ట్ రిటైరింగ్ స్టేజ్ అని అందరూ అనుకుంటూ వుండగా మ్యూజిక్ చేసిన 'నిక్కా' సినిమాలోని 'దిల్ కె అర్ మా' పాటతో సల్మా ఆగా బెస్ట్ సింగర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ తెచ్చేసుకుంది. ఆ తర్వాత బాంబే రవిగా మళయాళ చిత్రాలకు సంగీతం ఇస్తే రెండు సార్లు ( 'నక్షత్రంగల్' సినిమాలోని 'మంజల్ ప్రసాదవుమ్ ' పాటకి, 'వైశాలి' లోని 'ఇందుపుష్పం' పాటకి) చిత్ర నేషనల్ అవార్డ్ వచ్చింది. మధ్యలో 'మహాభారత్' టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ తో ప్రాంతీయ బేధాల్లేకుండా దేశం మొత్తం ఇంటింటా రవి పేరు మార్మోగి పోయింది. అప్పటివరకూ ఆయన సంగీతాన్ని వేరే దారుల్లో తీసుకున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ 'సరిగమలు' చిత్రంతో నేరుగా స్వాగతం పలికింది. ఆ సినిమాలో జేసుదాసు పాడిన 'స్వర రాగ గంగా ప్రవాహమే' పాట ఔత్సాహిక గాయకులకి , మంచి పాటల కోసం ఎదురు చూసే శ్రోతలకి ఓ వరం లా నిలిచిపోయింది. 'ఎవరీ రవి ? ' తెలుగు వాళ్ళందరూ అడిగేలా చేసింది. 'సరిగమలు' సినిమాకి పాటలు రాసిన వేటూరి - ఆ పాటల గురించి , రవి గురించి ఇలా అన్నారు . " ఇహానికి పరానికి పనికొచ్చే సాహిత్యం సృష్టించే ఆవకాశం వున్న సినిమాలు ఎప్పుడో గాని రావు. సంగీత సాహిత్య భరితమైన 'సరిగమలు' చిత్రం - పాటల రచయితగా నాకెంతో తృప్తిని , మంచి పాటలు రాశానన్న నమ్మకాన్ని కలిగించిన చిత్రం. దానికి కారణం - అన్నీ ట్యూన్ కి రాసిన పాటలైనప్పటికీ - ఇచ్చిన ట్యూన్ లు సందర్భానికి పనికి వచ్చేవిగా , సాహిత్యానికి ఉపకరించేవిగా , ప్రేరణ కలిగించే విధంగా వుండడం. ఈ చిత్రం లోని పాటలు ఇంత ప్రసిద్ధి పొందడానికి మూల కారకుడు - మహా సంగీత విద్వాంసుడు - మా అందరికీ పూజనీయుడు అయినటువంటి రవి. ఆయన ఇచ్చిన ట్యూన్లలోని శక్తే నాచేత అటువంటి పాటలు రాయించింది. రవి గారు ఇచ్చిన ట్యూన్ల వల్ల నేను రాసిన సాహిత్యం అక్కరకొచ్చింది. 'సరిగమలు' లో నేను రాసిన ప్రతీ పాటకీ నా మది లో గూడు కట్టుకున్న భావాలు అక్షరాలుగా మారి అమృతోపమానమైన సంగీత ప్రవాహంలో పూల పడవల్లా తేలి మీ హృదయ తీరాలకు చేరాయి ". సర్వలోకాలకు చెందిన ఆ రవి కి అస్తమయం లేనట్టే స్వరలోకాలకు చెందిన ఈ రవికీ అస్తమయం లేదు. మరణం మరు జన్మకి శ్రీకారం అనుకుంటే మనం చెప్పే ఈ వీడ్కోలే వేడుకోలై స్వాగత వచనం పలుకుతుంది. అందుకు మన వేటూరి వారి వాక్యాలే సాక్ష్యం, నివాళీ కూడా ...
Monday, February 20, 2012
My Article in Eenadu Internet Edition on Susarla ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ లో సుసర్ల వారిపై నా వ్యాసం
సుసర్ల దక్షిణామూర్తి గారి గురించి నేను రాసిన ఆర్టికిల్ 26 ఫిబ్రవరి 2012సితారా లో వేశారు.
ఆ ఆర్టికిల్ నే ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ లో కూడా పబ్లిష్ చేశారు. జర్నలిస్ట్ గా వృత్తి పరంగా , వ్యక్తిగతంగా ఇది నిజంగా నాకెంతో సంతృప్తిని కలిగించిన విషయం. ఇక్కడ ఓ రెండు విషయాలు చెప్పుకోవాలి.
(1) సర్వాధికారి చిత్రం లో ఎన్టీఆర్ కి డబ్బింగ్ చెప్పినట్టుగా ప్రింట్ వుంటుంది.
అది ప్రింటింగ్ మిస్టేక్.
సుసర్ల వారు ఎం.జీ.ఆర్. కి డబ్బింగ్ చెప్పారు. పాఠకులు సవరించుకుని చదువుకోండి.
(2) అలాగే స్పేస్ లేక పొవడం వల్ల రెండు పేరాలు వారికి వెయ్యడానికి కుదరలేదు. ఇవి ఇక్కడ
జత పరుస్తున్నాను. (జగపతి వారి తొలి చిత్రం అన్నపూర్ణ లో అనే పేరా కి ముందు
ఈ రెండు పేరాలూ వుండాలి. ఇవి కూడా కలిపి చదువుకోండి.
" కొన్ని కొన్ని పాటల్ని ఎడాప్ట్ చేసినప్పుడు ఆయన చేసిన ప్రయోగాల్ని ప్రయోగాలుగా గుర్తించకుండా ఆ పాటల్ని పూర్తిగా ఆయన ఎక్కౌంట్ లో వేసేసారు మనవాళ్ళు. ఉదాహరణకి ఎమ్జీఆర్, భానుమతి నటించిన 'ఆలీబాబా 40 దొంగలు. అంతకు ముందు మహిపాల్, షకీలా హీరో హీరోయిన్లుగా హిందీ లో వచ్చిన 'ఆలీబాబా చాలీస్ చోర్' ఆధారంగా తీశారీ సినిమాని. చిత్రగుప్త - ఎస్. ఎన్. త్రిపాఠి స్వరపరిచిన కొన్ని ట్యూన్ లని తెలుగు, తమిళ వెర్షన్ లకు వాడుకున్నారు. అందులో 'ప్రియతమా మనసు మారునా' (తమిళం లో 'మాసిలా వున్మై కాదలా') ఒకటి. హిందీ వెర్షన్ లో 'ఏ సభా ఉన్ సే కెహ జరా' . అయినా సరే ఈ పాటను సుసర్ల వారి సృజన గా చెప్తారు. నిజానికి తెలుగు తమిళ వెర్షన్ లకు ఆయన చేసిన మార్పు వేరు. హిందీ వెర్షన్ లోని తాళ గతిని మార్చి పాటను స్పీడు చేశారు. ఇంటర్లూడ్లు మార్చారు. అవేవీ గుర్తింపు లోకి రాకుండా పోయాయి.
అలాగే 'వీర కంకణం' లో జగ్గయ్యకు ఘంటసాల పాడిన రెండు పాటలు. ఈ సినిమాలో హీరో ఎన్టీయార్ కి ఏయం రాజా చేత, విలన్ జగ్గయ్య కి ఘంటసాల చేత పాడించారని - ఇదొక ప్రయోగం అనీ తెగ చెప్పేసుకున్నారు. నిజానికి అది ప్రయోగం కాదు. అవసరం. సుసర్ల దాన్ని తెలివిగా పరిష్కరించుకున్నారు. 'వీర కంకణం' లో ఎన్టీయార్ పాటలకు ఘంటసాలే అక్కర్లేదు. కానీ జగయ్య పాటలకు ఘంటసాలే కావాలి. ఎందుకంటే తమిళ మాతృక 'మంత్రి కుమారి' లో జి. రామనాథన్ స్వరపరిచిన ట్యూన్లు అటువంటివి. ఈ 'వీర కంకణం' లోని ' తేలి తేలి నా మనసు' (తమిళం లో 'ఉలవుమ్ తెన్ద్ర పాటయిలే') పాటలో 'కొండ వంటి గుండె నీవు తెలియ లేవులే' దగ్గిర 'నీదు ఓర చూపులోన నేర్చుకుంటినే' దగ్గిర గల ఎగుడు దిగుడుల్లో వాయిస్ మీద పూర్తిపట్టు తో పాడాలి. 'నలుసులెన్ని ఉన్నవో తెలుసుకోగదే' దగ్గర వాయిస్ ని ఒక్కసారిగా రెయిజ్ చెయ్యాలి. ఇవన్నీ ఘంటసాల గొంతుకి నప్పుతాయి. అలాగే 'రావే రావే పోవు స్థలం అతి చేరువయే నా రాణీ ' (తమిళం లో 'వారాయ్ నీ వారాయ్) పాట తెలుగులో ఘంటసాల తప్ప మరొకరు పాడలేని పాట. బాలూ వంటి గాయకుడు డిమాన్ స్త్రేట్ చేసి చూపిస్తే తప్ప ఈ పాటకు ఘంటసాల వాయిస్ ఎంత అవసరమో విప్పి చెప్పలేనంత గొప్ప పాట. అందుకే ఈ పాటల్ని ఘంటసాల చేత పాడించడం ప్రయోగం కాదు అవసరం. "
ఇవే ఆ రెండు పేరాలూ
---------------------------------------------------------------------------------------------------------------
మితృలు సూర్య ప్రకాశ రావు గారు కూడా ఓ లింకుని పంపించారు. దాన్ని పేస్ట్ చేస్తున్నాను.చూసి మీ కామెంట్లను జత చేయండి.
Friday, February 10, 2012
Great Music Director Susarla DakshinaMurthy is no more సుస్వర సుసర్ల ఇక లేరు
లతా మంగేష్కర్ తో తెలుగు సినిమాలో మొదటి సారి గా పాడించిన అలనాటి ప్రముఖ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణా మూర్తి గారు ఫిబ్రవరి తొమ్మిది రాత్రి తొమ్మిదిన్నరకి చెన్నై లో కన్ను మూశారు. చల్లని వెన్నెలలో (సంతానం), దేవీ శ్రీదేవీ (సంతానం), సలలిత రాగ సుధా రస సారం (నర్తనశాల), జననీ శివ కామినీ (నర్తనశాల), సఖియా వివరించవే (నర్తనశాల), చల్లని రాజా ఓ చందమామా (ఇలవేల్పు) లాంటి ఇవాళ్టికీ మర్చిపోలేని మధుర గీతాలెన్నో స్వర పరిచారాయన. ఎస్పీ బాలు ని సినీ పరిశ్రమకి పరిచయం చేసిన కోదండపాణి ఈయన కు అసిస్టెంట్ గా కొన్నాళ్ళు పనిచేసారు. అంచేత బాలు ఈయనని 'మా గుగ్గురువులు (గురువులకు గురువు)' అని అంటూ వుంటారు. సుసర్ల దక్షిణా మూర్తి గారి వయసు తొంభై ఏళ్ళు వుంటాయి. గత సంవత్సరం రేడియో మిర్చి అవార్డులకి జ్యూరీ సభ్యుడిగా వున్నప్పుడు ఈయనకి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ పట్టుబట్టి మరీ ఇప్పించాను. ఆ మహానుభావుడి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ -
Thursday, February 9, 2012
Re-recording with Ilayaraja's inspiration ఇళయరాజా ఇన్స్పిరేషన్ తో 'ఋషి' లో రీ రికార్డింగ్
ఎల్వీ ప్రసాద్ గారి అబ్బాయి శ్రీ రమేష్ ప్రసాద్ ఓ రియల్ జెంటిల్ మాన్ . ఏక్ దూజే కే లీయే తర్వాత దాదాపు ఇరవై ఏళ్లుగా చిత్ర నిర్మాణానికి దూరంగా వున్న ప్రసాద్ ప్రొడక్షన్స్ పేరిట మళ్ళీ ఓ సినిమాని నిర్మించారు. ఆ సినిమా పేరే 'ఋషి'.
తండ్రి ఎల్వీ ప్రసాద్ గారిలాగే రమేష్ ప్రసాద్ గారు విలువలకు ప్రాదాన్యత నిచ్చే వ్యక్తి కావడం తో ఆయన నిర్మించిన ' ఋషి' సినిమాలో కూడా ఆద్యంతం ఓ కమిట్ మెంటు, విలువలు కనిపిస్తాయి. చవకబారు హాస్యం, దిగజారుడు శృంగారం మచ్చుకైనా వుండవు. సినిమా పూర్తయ్యాక బరువెక్కిన గుండెతో నిశ్శబ్దం గా బైటికి వస్తాం .
మనకి మైండ్ పని చేస్తోందో లేదో, గుండె అసలు వుందో లేక బండ బారి పోయిందో మనకే అర్ధం కాని విధంగా వుంటుంది కొన్నిసినిమాలు చూస్తుంటే ! సరైన ప్రత్యామ్నాయం లేక అటువంటి సినిమాలనే చూస్తుంటాం ఒక్కోసారి. అంతకన్నాఅప్పుడప్పుడు ఇలాటి గుండె బరువెక్కే సినిమాలు చూడడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. మంచిని గౌరవించని వారు చెడు గురించి మాట్లాడే హక్కు ని ఆటోమాటిక్ గా కోల్పోతారు కాబట్టి మంచి సినిమాలు రావడం లేదు అని కంప్లయింట్ చేసే వారు ఇలాటి సినిమాలు వస్తే ఎలా స్పందిస్తున్నాం అంటూ ఆత్మ విమర్శ చేసుకునే సమయం ఇది అని అనిపిస్తుందీ సినిమా చూశాక.
సినిమా బిగినింగ్ లోనే ఓ బ్యూటిఫుల్ డైలాగ్ - 'ఇక్కడ సిగిరెట్ కాల్చుకోవచ్చా ... ఇది నాన్ స్మోకింగ్ జోనేనా ?' అడుగుతాడో జర్నలిస్ట్ . 'అసలు హ్యూమన్ బాడియే ఓ నాన్ స్మోకింగ్ జోన్' జవాబిస్తాడు డాక్టర్ - సినిమా నిండా ఇలాటివెన్నో.
ఇదంతా ఒక ఎత్తు. ఈ సినిమాకి సమకూరిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటీ ఒక ఎత్తు. ఇళయరాజా ఇన్స్పిరేషన్ తో చేసారా అన్నంత ఎఫెక్టివ్ గా వచ్చింది రీ రికార్డింగ్. చేసింది ఎవరని ఇంట్రవెల్ లో ఎంక్వయిరీ చేస్తే - స్నిగ్ధ - అని చెప్పారు సినిమా యూనిట్ కి సంబందించినవారు. ఆశ్చర్య పోయేంత లోగానే - తర్వాత లాయర్ వేషం లో కనిపిస్తుంది చూడండి - అన్నారు. తీరా చూస్తే 'అలా మొదలయింది' సినిమాలో టిపికల్ గా కనిపించే ( తమ్ముడు లేడీసా)అమ్మాయే ఈ స్నిగ్ధ. మొట్ట మొదట సింగర్ గా ప్రయత్నించిందిట అలా మొదలయింది లో ... కానీ వేషం వెయ్యాల్సి వచ్చింది. 'అల్లం వెల్లుల్లి ' సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసిందట. సినిమా అయిపోయిన తర్వాత మరి కాస్త ఎంక్వయిరీ చేస్తే తెలిసాయీ విషయాలు . ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ కి మాత్రం హ్యాట్సాఫ్ టు స్నిగ్ధ.
ఈ 'ఋషి' సినిమా ఎలాగూ జాతీయ అవార్డుల్ని సాధించుకుంటుంది కనుక స్నిగ్ధ ఎఫర్ట్స్ ని ప్రాంతీయ స్థాయి లో నైనా ప్రశంసించడం మన కర్తవ్యం.
Tuesday, February 7, 2012
Trivikram - Sirivennela - Arudra - Atreya త్రివిక్రమ్ - సిరివెన్నెల - ఆరుద్ర - ఆత్రేయ
మా మ్యూజిక్ అవార్డుల్లో సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన స్పీచ్ కి
స్పందించని వారు లేరు. యూ ట్యూబ్ లోనూ , పేస్ బుక్కుల్లోనూ తెగ పెట్టేశారా వీడియో ని.
'ప్రాగ్దిశ వీణియ పైన -
దినకర మయూఖ తంత్రుల పైన -
జాగృత విహంగ తతులే -
వినీల గగనపు వేదిక పైన'
అంటూ సీతా రామ శాస్త్రి గారు 'సిరివెన్నెల' లో రాసిన పాట విని డిక్షనరీ చూసానన్నాడాయన.
నిజం ... ఆ మాటల్లోని ప్రతి పదానికి అర్ధం చాలామంది పెద్దవాళ్ళకి కూడా తెలియదు.
ప్రాగ్దిశ = తూరుపు దిక్కు, మయూఖము = కిరణము, జాగృత = మేలుకున్న , విహంగము = పక్షి, తతి = సముదాయము , గగనము = ఆకాశం -
అని విడమర్చి చెపితే కానీ తెలుసుకోలేని పరిస్తితుల్లోనే వున్నాం మనం.
ఓసారి ఓ ప్రముఖ దిన పత్రిక ఈ పాట సాహిత్యాన్ని ప్రచురిస్తూ 'తతి' ఏమిటండీ 'గతి' అని ఉండాలేమో అని నన్ను అడగడం జరిగింది. దానికి అర్ధం చెప్పాక "అలాగా ... ఇలాంటి మాటలు సినిమా పాటల్లో ఎవరూ వాడరు కదండీ" అని అన్నారు.
"బాల భారతం సినిమాలోని ' మానవుడే మహనీయుడు' పాటలో ఆరుద్ర గారు వాడారండీ -
గ్రహరాశులనధిగమించి ,
ఘన తారల పథము నుంచి ,
గగనాంతర రోదసిలో
గంధర్వ గోళ తతులు దాటి -
అంటూ రాశారండీ "
అని వివరించాను.
ఇటువంటిదే మరొక సంఘటన. ఓ పెద్దాయన, సినీ రచయిత కూడా ... మాటల సందర్భం లో చెప్పారు
"ఓ కుగ్రామం లో ఓ పెళ్లి కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ' సేస ' పట్టండి అన్నారు. నాకు అర్ధం కాలేదు. చేతికి అక్షతలు ఇచ్చారు. అప్పుడు తెలుసుకున్నాను అక్షతల్ని సేసలంటారని."
వెంటనే అన్నాను " ఆత్రేయ గారు ఇదెప్పుడో రాశారు కదా !? " అని.
" ఆత్రేయా ... ఏం రాశాడు ? " అడిగారాయన
" ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో పాటలో - మూగ మనసు బాసలు మీకిద్దరికీ సేసలు - అని రాయలేదా ?" అన్నాను. ఆ పెద్దాయనకి చిన్న కోపం వచ్చింది. ఆయన చనిపోయి చాలా కాలం అయింది. అంచేత పేరు రాసి ఆయన పట్ల నాకున్న గౌరవ భావానికి కళంకం తెచ్చుకోలేను.
మన భాషకి సంబందించిన కనీస జ్ఞానాన్ని సినిమా పాటల ద్వారా కూడా పెంపొందించుకోవచ్చు అని తెలియచెప్పడానికే ఈ ఉదాహరణలు.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే - నచ్చిన సినిమా పాటల్ని కేవలం విని వూరుకోకండి. వీలయితే ఆ పాట సాహిత్యాన్ని రాసి చూసుకోండి. మీ భాషా జ్ఞానం లో కచ్చితంగా మీకు తెలియకుండానే మార్పు వచ్చేస్తుంది. శని ఆది వారాల్లో కనీసం ఒక తెలుగు పాటనైనా విని రాయమని, అలా రాసి చూపిస్తేనే బైటికి తీసుకెళ్తానని మీ పిల్లల్ని ఊరించి చూడండి. సినిమా పాట కనుక ఆకర్షణ సహజం. ఫలితం అద్భుతం.
మన పిల్లలకి తెలుగు రావాలంటే ఇంతకు మించిన సులువైన మార్గం లేదు ప్రస్తుతానికి.
Sunday, February 5, 2012
Hearts off to Shreya Goshal హార్ట్సాఫ్ టు శ్రేయా గోషల్
నా అనుకున్న వాళ్ళు
మన అనుకున్న వాళ్ళు
ఇంచుమించు ప్రతి ఒక్కరూ ...
మనల్ని ఒంటరిగా ఒదిలేసే క్షణాలు చాలా సార్లు వుంటాయి జీవితంలో .
ఎవరి కారణాలు వారికి వుంటాయి.
మనం మాత్రం ఒంటరిగా మిగిలిపోతూవుంటాం.
ఒక్కో సారి సమూహంలో కూడా ఏకాంతం అయిపోతూ వుంటాం.
మనసులోనా ... మస్తిష్కం లోనా ...
ఆలోచనలోనా .. అనుభూతిలోనా ...
ఎక్కడో ఏమిటో తెలియని గ్లాని
ఎందుకో చెప్పలేం గాని ....
అప్పుడో అమృత స్పర్శ ...
భగవంతుడు మనకోసమే పంపినట్టు !
ఓ చల్లటి వెలుగు...
మెల్లగా పాకుతూ, మనసంతా పరుచుకుంటూ... !!
ఎక్కిళ్ళతో ఎగసి పడుతున్నగుండె ...
నిశ్శబ్దంగా రోదిస్తూంటే ...
ఉబుకుతున్న కన్నీటి బిందువుల్లో ఓ తియ్యటి తృప్తి !!!
ఈ క్షణాన ఈ ప్రాణాలు ఇలాగే పోతే బాగుణ్ణు అనుకునేలా ...
ఈ అలౌకిక ఆనందం అందరికీ పంచడం కోసం బ్రతకాలనుకునేలా ...
ఈ అనుభూతులన్నిటినీ సంగీతం ద్వారా అందించగలమా ?
ఒకవేళ స్వరపరిస్తే ...
ఆపాత మధురమైన ఆ సంగీతానికి
ఆలోచనామృత తుల్యమైన సాహిత్యం సహాయం అవసరమా ?
అనుభవైకవేద్య మైన ఆ మాధుర్యానికి ఆలాపనలు సరిపోవా ?
అది సరి అయితే - అందుకు సరితూగ గల స్వరం వుందా ...? అసలుంటుందా ?
ఉన్నా ఆ స్వరానికి ఈ అనుభూతిని ఆవిష్కరించగల సామర్ధ్యం వుంటుందా ?
అదీ వున్నా ,,,
ఆ సామర్ధ్యానికి - గుండె తడిని కంటి చెమ్మ గా మార్చి ప్రవహింప చేసే - హృదయం వుండే అవకాశం వుందా ?
సుస్వర సంగీతప్రియుల కోసం ఆ సరస్వతీ దేవి రెహమాన్ మేధస్సులో సృష్టించిన ఓ ప్రయోగాన్ని ఈ ప్రశ్నల రూపంలోకి మార్చుకుంటే అందుకు వచ్చే సమాధానం శ్రేయా గోషల్ , నిదర్శనం 'ఏక్ దివానా థా' సినిమా ఆడియోలో 'బ్రేకింగ్ ప్రామిసెస్' పేరుతో ఆమె ఆలపించిన ఆలాపనలు.
తెలుగులో వచ్చిన 'ఏ మాయ చేసావె', తమిళంలో వచ్చిన 'విన్నైత్తాండి వరువాయా' చిత్రాల హిందీ వెర్షనే 'ఏక్ దివానా థా'. తెలుగు తమిళ చిత్రాల్లోని ట్యూన్ లన్నీ హిందీ వెర్షన్ లోనూ వున్నాయి. అవి కాక మరికొన్ని అదనంగా కూడా వున్నాయి . వాటిలో ఒకటి శ్రేయా గోషల్ తో రెహమాన్ పాడించిన ఈ ఆలాపన. 'ఆరోమలై' అన్న పదమొక్కటె ఇందులోని సాహిత్యం. తక్కినదంతా ఆలాపనే. ఆరోమలై అన్నది మలయాళ పదం. తెలుగులో 'నా ప్రియతమా' దానికి దీటైన అర్ధం అని మా అమ్మాయి సుమ (ప్రముఖ యాంకర్) చెప్పింది.
ఈ ఆలాపన భాగేశ్వరి రాగం లో వుంది. ఉత్తరాదిన దీన్ని భాగేశ్రీ అని అంటుంటారు. మంటలు రేపే నెలరాజా (రాము), రారా కనరారా (జగదేక వీరుని కథ), నైన్ సే నైన్ నాహీ మిలా (ఝనక్ ఝనక్ పాయల్ బాజే) వంటి సినీ గీతాలు ఈ రాగానికి మంచి ఉదాహరణలు. శోక తప్త విరహం ఈ రాగంలో బాగా పలుకుతుంది. గుండెలు పిండే తత్వం ఈ రాగం లో ఒదుగుతుంది.. రెహమాన్ ఇవన్నీ తెలిసిన వాడు కావడం చేత ఈ రాగం లోని జీవస్వరాలన్నిటినీ పిండి శ్రేయా గోషాల్ అనే మకరంద మాధుర్యం తో కలగలిపి సుస్వరానికి పులకించిపోయే శ్రోతలకు ఒక మరపురాని కానుకగా సమర్పించాడు.
రెహమాన్ ఇంతటి వాడు, అంతటి వాడు అని ఇవాళ ప్రత్యేకించి చెప్పవలసిన అవసరమూ లేదు. అది కొత్త విషయమూ కాదు. కానీ శ్రేయా గోషల్ గురించి మాత్రం చెప్పుకోవాలి. రెహమాన్ ఇచ్చింది ఇచ్చినట్టు పాడి వుంటే ఆమె గ్రాహ్యతని మెచ్చుకోవాలి. లేక రాగ స్వభావం చెప్పేసి ఆలపించుకుంటూ పొమ్మంటే ఆమె కల్పనా శక్తికి జోహార్లు చెయ్యాలి. ఎలా చూసినా హ్యాట్సాఫ్ ... సారీ ... హార్ట్సాఫ్ టు శ్రేయా గోషల్.
'ఏక్ దివానా థా' లోని ఈ ఆలాపనని అసలు ఏ పాటతోనూ కలిపి వినకండి. అంతకంటే ముందు మీ నుంచి మీ హృదయాన్ని బైటికి పంపేయండి. పంపే ముందు ఈ ఆలాపన ని ఇచ్చివినమని చెప్పండి. తర్వాత అది ఎంత అనందం తో మీ దగ్గరికి వస్తుందో మీకే తెలుస్తుంది. అలా జరక్కపోతే భగవంతుడనే డాక్టర్ మీ గురించి ఇచ్చే స్కానింగ్ రిపోర్ట్ చూసి చాలా బాధ పడవలసి వుంటుంది
Thursday, February 2, 2012
Another song on friendship from 'Nippu' స్నేహాన్ని తెలిపే మరో పాట - 'నిప్పు' నుంచి
ఫ్రెండ్ షిప్ కి సంబంధించి మరో సినిమా పాటొకటి వచ్చింది.
' ఆలీబాబా ఆలీబాబా - ఇట్సోకే బాబా డోంట్ వర్రీ బాబా'
అంటూ 'నిప్పు' సినిమా కోసం విశ్వ రాశాడు. పాట గురించి చెప్పే ముందు విశ్వ గురించి చెప్పాలి. రచయిత, స్వరకర్త , గాయకుడు ఈ మూడిటిలో ఎప్పుడు ఎలా కావాలంటే అలా మారిపోయి మాంచి రిజల్ట్ ఇవ్వగల సమర్ధుడితను. ఒక్కోసారి మూడు తానే అయిపోయి తన పాట తోనే సినిమాకి గుర్తింపునివ్వగల త్రిముఖ ప్రజ్ఞాశాలి కూడా (ఉదా : పడితినమ్మో... నేను- నా రాక్షసి) .
'పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే ' (అతడు) లాంటి ఆలోచింప చేసే ప్రయోగాలూ,
'గీత విను దొరకదు గుణ గణమే - చేవగల చతురత కణకణమే - చీడలను చెడమడ దునమడమే - నేటి మన అభినవ అభిమతమే - ఓటమిని ఎరుగని పెను పటిమే - పాదరస ఉరవడి నరనరమే -సమరమే సై ఇక చలగిక చకచక - ఎడతెగ చెయ్ ఇక విలయపు తైతక ' (దూకుడు) లాంటి టంగ్ ట్విస్టింగ్ పదాలతో ట్యూన్ లోని చెడుగుడుతనాన్ని మరింత ఆకర్షణీయం గా మలచగల పదకేళి విలాసం - ఇవన్నీ విశ్వకి పెన్ను తో పెట్టిన విద్యలు .
ఈ 'ఆలీ బాబా ' పాటలో కూడా ఫ్రెండ్ షిప్ మీద కొటేషన్ లాగ వాడుకోదగ్గ చరణం ఒకటి రాశాడు.
' నమ్మకాల దొంతరల్లో పుట్టేదీ - అంతరాల అడ్డుకట్ట నెట్టేదీ - నిన్నోడ నివ్వనీ తోడూనీడిదీ -
స్నేహమన్న ఒక్క నీతి కారణాన - రారాజు కూడ చేరెలే స్వర్గానా - మైత్రి మారునా యుగాలు మారినా '
ఇది ఆ పాటలో ఆఖరి చరణం. రెండో చరణం లో తన పదకేళీ విలాసాన్ని మరోసారి చూపించాడు. ' జత నస వస పిసినారైనా ' అన్నాడు. జత అంటే జతగాడు (స్నేహితుడు) . వాడు ఎంత నస గాడైనా, వస పోసిన పిట్ట లా ఎంత వాగుడు కాయైనా, ఆఖరికి పరమ పిసినారైనా ఫ్రెండంటే ఫ్రెండేగా . లోపాలతో సహా ప్రేమించే వాడేగా ఫ్రెండంటే. అందుకే ' ఏ దోస్ తీ గమ్మత్తుదీ ' అన్నాడు పల్లవి లో . ( దోస్తీ ని అలా వేరు చెయ్యకూడదు అనకండి. ఆర్డీ బర్మన్ అంతటి వాడే ' ఏ ... దోస్ తీ - హమ్ నహీ చోడెంగే' అంటూ ట్యూన్ చేసాడు).
నిజానికి ఏ దోస్ తీ అన్నదే ఆసలు పల్లవి. 'ఆలీబాబా ఆలీబాబా ఇట్సోకే బాబా డోంట్ వర్రీ బాబ' అన్నవి హుక్ లైన్లు. ఇవి తమన్ ఇచ్చినవే అయివుంటాయి. ఎందుకంటే - 'ముస్తాఫా ముస్తాఫా డోంట్ వర్రీ ముస్తాఫా' అన్నాడు గా ఏ. ఆర్. రెహమాన్. అతను 'ముస్తఫా' ను పాపులర్ చేస్తే మనం 'ఆలీబాబా' ని పాపులర్ చేద్దాం అనుకోవచ్చు. క్రియేటివ్ ఫీల్ల్ద్ లో ఇలాటివి తప్పు కానే కాదు. ఏ ప్రయోగమూ చెయ్యకపోతే అది క్రియేటివిటీ ఎలా అవుతుంది ? పైగా తమన్ ఈ పాటకి మిక్కి జే మేయర్ లా ' తడి కన్నులనే తుడిచే నేస్తమా ' లాంటి సెంటిమెంట్ రూట్ ని కాకుండా - రెహమాన్ చూపించిన 'ముస్తఫా' లాంటి ఫుల్ జోష్ రూట్నే నమ్ముకున్నట్టున్నాడు.అందుకే ఈ ' ఆలీబాబా ' అలాంటి 'జోష్ ఫుల్' ట్యూన్ ఇచ్చాడు. బీట్ లోనూ, ఆర్కేష్ట్రయిజేషన్ లోనూ మధ్య మధ్య' గురువారం మార్చ్ ఒకటి ' (దూకుడు) గుర్తొస్తూ వుంటుంది. అది గుర్తొస్తూ వుంటుందో లేక మనం దాన్ని మర్చిపోలేకపోతున్నామో !? ఎనీ వే
వీటన్నిటిని మించినది ఈ పాటని జావేద్ ఆలీ తో పాడించడం . అతని వాయిస్ భలేగా సూట్ అయిందీ పాటకి.
జావేద్ ఆలీ గురించి చెప్పాలిక్కడ. అసలు పేరు జావేద్ హుస్సేన్ . ప్రముఖ గజల్ సింగర్ ఉస్తాద్ గులాం ఆలీ దగ్గిర శిష్యరికం చేశాడు కనుక గురునామం స్వీకరించి తన పేరులో కలుపుకున్నాడు. ఎంత మంచి సంస్కారమో కదా !? 'జోధా అక్బర్' లోని 'కేహేనేకొ జష్న్- ఎ - బహారా హే '(Jashn-E-Bahaaraa)
పాట ద్వారా అందరికీ తెలిశాడు. రెహమాన్ ఇలాటి వాళ్ళని వెతికి మరీ పట్టుకుంటాడు. తర్వాత తెలుగులో - రామ్ నటించిన 'గణేష్' లో 'తనేమందో' అనే ఓ మంచి పాట చాలా బాగా పాడేడు. సినిమా హిట్ కాకపోవడంతో పాట పాపులర్ కాకుండా పోయింది. తర్వాత'మహం మహమాయే ' (కొమరం పులి), 'ఏవో పిచ్చి వేషాలు' (వాంటెడ్) రావా సక్కని రసగుల్లా ( శక్తి లో సుర్రా సుర్రన్నాడే) పాటలు పాడేడు.
తమన్ రెహమాన్ రూట్ నే నమ్ముకున్నాడనడానికి మరో చిన్న ఉదాహరణ కనబడుతోందీ పాటలో. 'ఏ మాయ చేసావే ' లో 'కుందనబ్బొమ్మ' పాట గుర్తుందా ? అందులో 'నీ పాదం నడిచే ' దగ్గర బెన్నీదయాళ్ 'ఊ ఊ ఊ ఊ' అంటూ పాడతాడు. ఈ 'ఆలీబాబా' పాటలో జావేద్ ఆలీ తో రెండో చరణం ఎండింగ్తర్వాత అలా అనిపించడానికి ట్రయ్ చేసాడు తమన్. కుందనబ్బొమ్మ పాటలో ఉన్నంత లెంగ్త్ వుండదు గానీ దాన్ని మాత్రం గుర్తు చేస్తూ వుంటుంది.
పాటని మామూలు గా వినండి ... తర్వాత లిరిక్ ఎదురు గా పెట్టుకుని వినండి ... ఆ తర్వాత పాడడానికి ప్రయత్నిస్తూ వినండి. కచ్చితంగా ఈ మూడు దశల్లోనూ మీ అభిప్రాయాల్లో కలిగే మార్పు ని మీరే గమనిస్తారు.
ఆలీబాబా ఆలీబాబా
ఇట్సోకే బాబా డోంట్ వర్రీ బాబా
లెట్స్ గో (లేట్ అస్ గో)
ఏ దోస్ తీ గమ్మత్తుదీ
పణవెట్టే ప్రాణం సైతం తృణ మంటుందీ
ఏ దోస్ తీ గమ్మత్తుదీ
ఉండగానే మిత్రుడు అన్ని తానై
పైసలతో పనేమి సబ్ అప్ నా హై
చలో పదా మరీ జమానా జీత్ నే
అల్లుకున్న ఆశలేరా ప్రేమంటే
ఆశ లేని పాశమేర మైత్రంటే
కాన ఎప్పుడూ ఫ్రెండ్స్ లవ్ యూ
// ఆలీ బాబా //
జత నస వస పిసినారైనా
చెల్లుర సుమతీ
............
లోకమంత వింటదీ చెప్పేదీ
చెప్పలేక వున్న వింటదీ ఈ దోస్తీ
అందుకే ఇదీ సాటిలేనిదీ
// ఆలీ బాబా //
నమ్మకాల దొంతరల్లో పుట్టేదీ
అంతరాల అడ్డుకట్ట నెట్టేదీ
నిన్నోడ నివ్వనీ తోడూనీడిదీ
స్నేహమన్న ఒక్క నీతి కారణాన
రారాజు కూడ చేరెలే స్వర్గానా
మైత్రి మారునా యుగాలు మారినా
// ఆలీ బాబా //
Tuesday, January 31, 2012
Attitude of Mahesh Babu మహేష్ బాబు ధోరణి ఇలా వుంది
నిన్ననే పని మీద సీతా రామ శాస్త్రి గారింటికి వెళ్లాను.అప్పుడే ఓ పాట పూర్తి చేసి,ఆ ఆనందం లో
వున్నారాయన.'కొత్త బంగారు లోకం ' సినిమాని తీసిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో దిల్ రాజు గారు తీస్తున్న 'సీతమ్మ వాకిటిలో సిరిమల్లె చెట్టు' కోసం రాసిన పాట అది. ఆ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటిస్తున్నారని అందరికీ తెలుసు.మా మధ్య మాటలు మొదలవుతూ ఉండగానే వచ్చేశారు దిల్ రాజు. రాసిన పాటని వినిపించారు శాస్త్రి గారు.సాధారణం గా పాట ని వినిపించినప్పుడు తన స్వంత బాణీ లో వినిపించడం శాస్త్రి గారి స్టయిల్. కానీ ఈ పాటని మాత్రం మిక్కి జే మేయర్ ఇచ్చిన tune లోనే వినిపించారాయన . అంటే ఆ tuneఅంత బాగా రిజిస్టర్అయిపోయిందన్నమాట ఆయనలో. దిల్ రాజు గారికి లిరిక్స్ నచ్చేశాయి. శాస్త్రి గారు రాసిన వెర్షన్స్ లో తనకు కావలిసినవి టిక్కు పెట్టుకుని 'ఇవి తీసుకుంటాను' అన్నారు. 'నీ ఇష్టం ... నీకేది నచ్చితే అదే తీసుకో ' అన్నారు శాస్త్రి గారు.'అన్నీ బావున్నాయి.కానీ నేను టిక్కు పెట్టినవి ఇంకా ఎక్కువ బావున్నాయి' అన్నారు దిల్ రాజు. 'అన్నీఇంత బాగా రావడానికి కారణం మహేష్ బాబు యాటిట్యూడ్' అన్నారు శాస్త్రి గారు. 'నిజం గా అది మాత్రం గ్రేటండీ ' అన్నారు దిల్ రాజు. ఏంటన్నట్టుచూశాను. 'ఈకథని మేం దూకుడు,బిజినెస్ మాన్ షూటింగ్ మొదలు కాకముందు వినిపించాం అదే చెబుతూ ఇవాళ ఆ రెండూ హిట్ అయ్యాయని కథలో ఏ మార్పులూ చెయ్యకండి. నాకెలా వినిపించారో అలాగే తియ్యండి అన్నారు మహేష్ బాబు' అని వివరించారు దిల్ రాజు.
వున్నారాయన.'కొత్త బంగారు లోకం ' సినిమాని తీసిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో దిల్ రాజు గారు తీస్తున్న 'సీతమ్మ వాకిటిలో సిరిమల్లె చెట్టు' కోసం రాసిన పాట అది. ఆ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటిస్తున్నారని అందరికీ తెలుసు.మా మధ్య మాటలు మొదలవుతూ ఉండగానే వచ్చేశారు దిల్ రాజు. రాసిన పాటని వినిపించారు శాస్త్రి గారు.సాధారణం గా పాట ని వినిపించినప్పుడు తన స్వంత బాణీ లో వినిపించడం శాస్త్రి గారి స్టయిల్. కానీ ఈ పాటని మాత్రం మిక్కి జే మేయర్ ఇచ్చిన tune లోనే వినిపించారాయన . అంటే ఆ tuneఅంత బాగా రిజిస్టర్అయిపోయిందన్నమాట ఆయనలో. దిల్ రాజు గారికి లిరిక్స్ నచ్చేశాయి. శాస్త్రి గారు రాసిన వెర్షన్స్ లో తనకు కావలిసినవి టిక్కు పెట్టుకుని 'ఇవి తీసుకుంటాను' అన్నారు. 'నీ ఇష్టం ... నీకేది నచ్చితే అదే తీసుకో ' అన్నారు శాస్త్రి గారు.'అన్నీ బావున్నాయి.కానీ నేను టిక్కు పెట్టినవి ఇంకా ఎక్కువ బావున్నాయి' అన్నారు దిల్ రాజు. 'అన్నీఇంత బాగా రావడానికి కారణం మహేష్ బాబు యాటిట్యూడ్' అన్నారు శాస్త్రి గారు. 'నిజం గా అది మాత్రం గ్రేటండీ ' అన్నారు దిల్ రాజు. ఏంటన్నట్టుచూశాను. 'ఈకథని మేం దూకుడు,బిజినెస్ మాన్ షూటింగ్ మొదలు కాకముందు వినిపించాం అదే చెబుతూ ఇవాళ ఆ రెండూ హిట్ అయ్యాయని కథలో ఏ మార్పులూ చెయ్యకండి. నాకెలా వినిపించారో అలాగే తియ్యండి అన్నారు మహేష్ బాబు' అని వివరించారు దిల్ రాజు.
'అదే రాజూ ఆ యాటిట్యూడే నాకు తెగ నచ్చేసింది.' అన్నారు శాస్త్రి గారు. సాధారణం గా ఓ రెండు సినిమాలు క్లిక్ అయితే 'నా నుంచి జనం ఇలాటివే ఎక్స్ పెక్ట్ చేస్తారు ' అంటూ కథలో మార్పులు సూచిస్తూ వుంటారు కొంతమంది. దాంతో వెరైటీ చేద్దాం అంటే కుదరక రొటీన్ కి వచ్చేస్తారు. అన్దుకు భిన్నంగా నిజంగా ఇదే ధోరణి లో మహేష్ బాబు కొనసాగితే కథల్లో వైవిధ్యం ఉండడానికి అవకాశం వుంటుంది. ఈ లెక్కన 'సీతమ్మ వాకిటిలో సిరిమల్లె చెట్టు' సినిమా ఆ టైటిల్ లాగే బ్యూటిఫుల్ గా తయారవుతుందని అనిపిస్తోంది.
Subscribe to:
Posts (Atom)